బడి పిల్లలు భద్రమేనా..?.. స్కూల్​ బస్సుల ఫిట్​నెస్ తనిఖీపై నిర్లక్ష్యం

బడి పిల్లలు భద్రమేనా..?.. స్కూల్​ బస్సుల ఫిట్​నెస్ తనిఖీపై నిర్లక్ష్యం
  •     లంచాలతో నెట్టుకొస్తున్న మేనేజ్​మెంట్లు
  •     బడుల రీఓపెన్​కు ముందే పూర్తి కావాల్సిన తంతు
  •     ఇంకా 50 శాతం ముగియలే

నిజామాబాద్, వెలుగు: ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ప్రైవేట్​స్కూల్ బస్సుల ఫిట్​నెస్ ​చెక్ ప్రహసనంగా మారిపోయింది.ప్రతి ఏడాది బడులు రీఓపెన్​కావడానికి ముందే ఫిట్​నెస్ తనిఖీలు పూర్తి కావాల్సి ఉండగా, ఇంకా 50 శాతం కూడా పూర్తికాలేదు. ఎప్పటిలాగే లంచాలతో నెట్టుకురావాలని ఆలోచిస్తూ ప్రైవేట్​స్కూల్స్ మేనేజ్​మెంట్లు స్టూడెంట్ల సెక్యూరిటీని గాలికి వదిలేస్తున్నాయి. ప్రమాదాలు జరిగినప్పుడు మాత్రమే హడావిడి చేస్తున్న ట్రాన్స్​పోర్టు ఆఫీసర్లు తరువాత మామూళ్లతో సర్దుకుపోతున్నారు. గవర్నమెంట్​రూల్స్​ఖాతరు చేయకుండా నడుస్తున్న బస్సులపై చర్యలు తీసుకోవడం లేదు. 

మొత్తం 1,455 ప్రైవేటు బస్సులు

నిజామాబాద్ ​జిల్లాలో 520  ప్రైవేట్ స్కూల్స్​ఉండగా, సుమారు 1,200 బస్సులు నడుస్తున్నాయి. స్టూడెంట్ల సంఖ్య 2.60 లక్షల వరకు ఉంది.  కామారెడ్డి జిల్లాలోని 175 ప్రైవేట్ బడుల్లో 90 వేల స్టూడెంట్ల కోసం 255 బస్సులను వినియోగిస్తున్నారు. ఇలా ఉమ్మడి జిల్లాలో మొత్తం1,455 ప్రైవేట్​స్కూల్​బస్సులు ఉన్నట్లు రికార్డులు చెబుతున్నాయి. ఒక విద్యార్థి నుంచి బస్సు చార్జీల కింద ఏడాదికి రూ.12 వేల నుంచి రూ.17 వేల వరకు మేనేజ్​మెంట్లు వసూలు చేస్తున్నాయి. బస్సుల ద్వారా ఆదాయాన్ని పెంచుకుంటున్న స్కూళ్ల యజమాన్యాలు రూల్స్ పాటించడం లేదు. 

ఇవీ రూల్స్.. 

స్టూడెంట్లను భద్రతగా స్కూళ్లకు తీసుకొచ్చి తిరిగి సేఫ్​గా ఇండ్లకు చేర్చేలా సర్కారు విధివిధానాలు ఉన్నాయి. ప్రైవేట్​లారీలు, కార్లు, ట్యాక్సీలు ఇతర అన్ని వెహికల్స్​కు ఆర్సీ గడువు దాటాకే ఫిట్​నెస్​పరీక్ష చేసి ఇంకొన్నాళ్లకు రిన్యూవల్​లేదా స్క్రాప్​గా మార్చాడమో చేస్తారు. కానీ, స్కూల్​బస్సుల విషయానికి వస్తే ప్రతి ఏడాది తప్పనిసరిగా ఫిట్​నెస్​ చేయించాలి. 15 ఏండ్లు దాటిన బస్సును స్టూడెంట్ల కోసం అసలు ఉపయోగించకూడదు. 60 ఏండ్లు దాటిన డ్రైవర్​ను అపాయింట్​చేయొద్దు. క్లీనర్, అటెండర్​తప్పక ఉండాలి. 

డ్రైవర్​ కంటి చూపు, గుండె జబ్బు, షుగర్​ లెవల్ రెగ్యులర్​గా స్కూల్​ మేనేజ్​మెంట్లు చెక్ చేసి రిపోర్టులు దగ్గర పెట్టుకోవాలి. స్కూల్స్​స్టార్ట్​ కావడానికి ముందు బస్సుకు పసుపు పేయింటింగ్​చేయించి.. ముందు భాగంలో తెలుపు వెనుక భాగంలో రెడ్​ రేడియం స్టిక్కర్లు వేయించాలి. స్కూల్​పేరు, ఫోన్​ నంబర్,​ స్టూడెంట్లను సూచించేలా బొమ్మలు అతికించాలి. ఫస్ట్​ఎయిబ్​బ్యాక్స్, ఫైర్​యాక్సిడెంట్​నివారించే ఎగ్జాస్టర్​ను తప్పక బస్సులో పెట్టాలి. బస్సులోని స్టూడెంట్లంతా డ్రైవర్​కు కనబడేలా ప్రత్యేక విజన్​మిర్రర్​, కిటికీల నుంచి తలలు బయటకు రాకుండా రాడ్​లు బిగించాలి. వాహనం టైర్ల నాణ్యతను రెగ్యులర్​గా గమనించాలి.  గంటకు 40 కిలోమీటర్ల స్పీడ్​తో మాత్రమే వీటిని నడుపాలి. సీట్ల సంఖ్యకు సమానంగా స్టూడెండ్లను అనుమతించాలి. 

తప్పించుకునే దారులపై దృష్టి

ఇన్ని రూల్స్ ఉన్నా మేనేజ్​మెంట్లు అడ్డదార్లు వెతుక్కుంటున్నాయి. ఆర్టీఓ అధికారులకు లంచాలు ఇచ్చి క్లీన్​చీట్​ పొందుతున్నాయి. వాహనాల సంఖ్యకు అనుగుణంగా ఫిట్​నెస్​ జారీ చేయడాన్ని, తనిఖీలను  ట్రాన్స్​పోర్టు ఆఫీసర్లు మరిచారు. ఏదైనా జరగరాని ఘటన జరిగితేగానీ స్పందించడంలేదు.

గతేడాది 200 దాటలేదు

జూన్​12న కొత్త విద్యా సంవత్సరం షురూ కానుంది. దానికి ముందే బస్సుల ఫిట్​నెస్​ కంప్లీట్​ చేసుకోవాలి. ఇప్పటివరకు ఉమ్మడి జిల్లాలో కేవలం 699 బస్సుల తనిఖీ​ మాత్రమే జరిగింది.  పది బస్సులున్న స్కూల్​మేనేజ్​మెంట్లు ఐదింటికి అంటే సగం వరకే ఫిట్​నెస్​ చేయిస్తున్నారు. మిగితా వాటిని లంచాలతో నెట్టుకొస్తుండగా, కొన్ని యాజమాన్యాలు అటువైపే వెళ్లడం లేదు. గతేడాది బస్సుల ఫిట్​నెన్​ చెక్​ 200 సంఖ్య దాటలేదు.