
కామారెడ్డి, వెలుగు : జిల్లాలో రోడ్డు ప్రమాదాలు తగ్గాయని ఎస్పీ రాజేశ్చంద్ర తెలిపారు. మంగళవారం ఈ ఏడాది 6 నెలల వివరాలు వెల్లడించారు. గతేడాది కంటే ఈ ఏడాది 6 నెలల్లో 21 శాతం యాక్సిడెంట్లు తగ్గాయన్నారు. 2024లో 317 యాక్సిడెంట్లు కాగా, 152 మంది మృతి చెందారన్నారు. ఈసారి 282 ప్రమాదాలు జరిగితే 120 మంది చనిపోయారన్నారు. మరణాల్లో 22 శాతం తగ్గిందన్నారు. యాక్సిడెంట్లు తగ్గించాలనే ఉద్దేశంతో ప్రతి రోజు వెహికల్స్ తనిఖీలు, డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు, హెల్మెట్, డ్రైవింగ్ లైసెన్స్ లేని వారికి, స్పీడ్గా వెళ్లే వారికి ఫైన్లు విధించటం వల్ల సాధ్యమైందన్నారు. 6 నెలల్లో లైసెన్స్లేని వారు 75,179, ఓవర్ స్పీడ్ 43,348, హెల్మెట్ లేని వారు 16,340, డ్రంక్ అండ్ డ్రైవ్ 5,942 ఫైన్లు వేశామన్నారు. 28 బ్లాక్ స్పాట్లను గుర్తించి సంబంధిత ఇంజినీరింగ్ అధికారులతో మాట్లాడి నివారణ చర్యలు చేపట్టామన్నారు.
దొంగతనాలు కూడా తగ్గాయన్నారు. గతంలో 259 చోరీలు అయితే, ఈసారి 214 జరిగాయన్నారు. వరకట్న వేధింపుల కేసులు గతంలో 174 ఉంటే, ఈ ఏడాది167 ఉన్నాయన్నారు. అంతర్ర్రాష్ట్ర పార్ధి గ్యాంగ్ 11 మంది సభ్యుల ముఠాను అరెస్ట్చేసినట్లు ఎస్పీ తెలిపారు. సీఐఈఆర్ అప్లికేషన్ ద్వారా ఇప్పటి వరకు 3,265 ఫోన్లను రికవరీ చేసి బాధితులకు ఇచ్చామన్నారు. జిల్లా పోలీసుల కోసం కొత్త లోగో అవిష్కరించామన్నారు. డయల్ 100కు సమాచారం అందిన వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుంటున్నారన్నారు. రానున్న ఈ 6 నెలల్లో నేరాలు తగ్గే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. వర్షాల దృష్ట్యా ప్రజలను అలర్ట్చేశామన్నారు.