హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర వ్యవసాయ శాఖ ప్రవేశపెట్టిన -యూరియా యాప్ 5 సక్సెస్ఫుల్గా అమలవుతోంది. 5 జిల్లాల్లో ప్రయోగాత్మకంగా ఈ యాప్ అమలు తీరును అధికారులు పరిశీలించారు. దాదాపు లక్ష మందికి పైగా యాప్ను డౌన్ లోడ్ చేసుకున్నారు.
ఆదిలాబాద్ జిల్లాలో 897, జనగామ జిల్లాలో 5150, మహబూబ్ నగర్ జిల్లాలో 3741, నల్లగొండ జిల్లాలో 3618 , పెద్దపల్లి జిల్లాలో 6,289 మంది రైతులు యాప్ ద్వారా యూరియా బుక్ చేసుకున్నారు. ఈ ఐదు జిల్లాల్లో ఈ యాప్ వినియోగించిన రైతులు.. తమ సమీప డీలర్ వద్ద 60,510 యూరియా బస్తాలు బుక్ చేసుకున్నారు.
217 మంది కౌలు రైతులు కూడా 678 యూరియా బస్తాలను ఈ యాప్ ద్వారా బుక్ చేసుకున్నారని వ్యవసాయశాఖ వెల్లడించింది. మొదటి రోజు అక్కడక్కడ తలెత్తిన సాంకేతిక సమస్యలను వెంటనే పరిష్కరించామని ఆఫీసర్లు వెల్లడించారు.
అన్ని జిల్లాల్లో అమలు చేస్తాం: తుమ్మల
రైతునేస్తం కార్యక్రమంలో భాగంగా రైతులకు యాప్ పై ఉన్న సందేహాలను నివృత్తి చేశామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. రాష్ట్రానికి ఇప్పటికే 5.30 లక్షల టన్నుల యూరియా వచ్చిందని, జనవరి, ఫిబ్రవరి నెలలకు సరిపడా యూరియాను ముందుగా తెప్పించడానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదని చెప్పారు. యూరియా యాప్ ను మరికొన్ని రోజులు పరిశీలించి రాష్ట్రవ్యాప్తంగా అమలు చేస్తామని
తెలిపారు.
సోయా, మక్క రైతులను ఆదుకోండి
వానాకాలం సీజన్లో భారీ వర్షాల కారణంగా తీవ్రంగా నష్టపోయిన సోయాబీన్, మొక్కజొన్న రైతులను ఆదుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని మంత్రి తుమ్మల కోరారు. ఈ మేరకు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్కు ఆయన లేఖ రాశారు.
