- భూపాలపల్లి జిల్లాలో ఒకే ఇంట్లో ఐదుగురికి కోవిడ్
- వృద్ధురాలికి జేఎన్.1 వేరియంట్ అటాక్
- లక్షణాలు లేకుండానే ఆ ఇంట్లో నలుగురికి పాజిటివ్
- రాష్ట్రంలో 50కి చేరిన యాక్టివ్ కేసుల సంఖ్య
హైదరాబాద్: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో కోవిడ్ కలకలం రేపింది. గణపురం మండలం గాంధీనగర్లో ఒకే కుటుంబంలో ఐదుగురికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు వైద్యులు తెలిపారు. రెండు రోజుల క్రితం అనారోగ్యంతో ఎంజీఎంలో చికిత్స పొందుతున్న ఓ వృద్ధురాలికి కొవిడ్-19 జేఎన్.1 వేరియంట్ సోకింది. దీంతో.. ఆమె కుటుంబ సభ్యులకు కరోనా టెస్టు నిర్వహించగా నలుగురికి కోవిడ్ లక్షణాలు లేకుండా పాజిటివ్ రిపోర్ట్ వచ్చింది. దీంతో జిల్లా వైద్య శాఖ అప్రమత్తమైంది. వారిని ఇంట్లోనే ఐసోలేట్ చేశామని.. వారి ఆరోగ్యం నిలకడగానే ఉందని డీఎంహెచ్వో మధుసూదన్ చెప్పారు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 4,054, తెలంగాణలో దాదాపు 50 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. 24 గంటల వ్యవధిలో 12 కొత్త కేసులు వచ్చాయని వైద్యాధికారులు చెప్పారు. సెలబ్రేషన్స్ టెన్షన్
దేశంలో కొత్త వేరియంట్ కేసులు వణుకుపుట్టిస్తుంటే ..తెలంగాణలో కరోనా కేసులు దడ పుట్టిస్తున్నాయి. అయితే ఓవైపు ప్రత్యేక పర్వదినాలు, మరోవైపు న్యూఇయర్ సెలబ్రేషన్స్ దగ్గర పడుతుండటంతో ఈకేసులు మరింత పెరిగే అవకాశం ఉంది. కరోనా పట్ల అప్రమత్తంగా ఉండాలని, స్వీయ జాగ్రత్తలు పాటించాలని, బహిరంగ స్థలాలలో మాస్కులు ధరించి, సామాజిక దూరం పాటించాలని ఇప్పటికే వైద్యాధికారులు ప్రజలకు సూచనలు చేస్తున్నారు. ఆస్పత్రుల్లో ప్రత్యేక వార్డులను ఏర్పాటు చేసి వైద్య సిబ్బందిని సిద్ధం చేసుకున్నారు.