గంజాయికి బానిసై ఏడేండ్లు తల్లిదండ్రులకు దూరం

గంజాయికి బానిసై ఏడేండ్లు తల్లిదండ్రులకు దూరం
  •    మరో ముగ్గురితో పోలీసులకు చిక్కిన యువకుడు
  •     నలుగురిని అదుపులోకి తీసుకున్న మాదాపూర్ పోలీసులు 
  •     1.5 కేజీల గంజాయి స్వాధీనం

గచ్చిబౌలి, వెలుగు: ఇంటర్​వరకు చదువులో రాణించిన ఓ యువకుడు గంజాయికి బానిసై ఏడేండ్లుగా కుటుంబానికి దూరమ్యాడు. మరో ముగ్గురితో కలిసి గంజాయి తాగుతూ తాజాగా పోలీసులకు చిక్కాడు. మాదాపూర్ జోన్ డీసీపీ డా.జి.వినీత్, టీజీ న్యాబ్​ఎస్పీ సాయి చైతన్య శనివారం గచ్చిబౌలిలోని డీసీపీ ఆఫీసులో వివరాలు వెల్లడించారు. హైదరాబాద్ దూద్​బౌలి ప్రాంతానికి చెందిన ఎం.సచితానంద్(28) గంజాయి పెడ్లర్. 

బోయిన్​పల్లికి చెందిన కురుంతోత్​రాథోడ్​నవీన్ నాయక్​(27), కూకట్​పల్లికి చెందిన ఇంటీరియర్​డిజైనర్ ప్రణీత్​రెడ్డి(25), న్యూ బోయిన్​పల్లికి చెందిన రాహుల్​ రాజ్(27) స్నేహితులు. వీరంతా కలిసి ఈ నెల 28న మాదాపూర్​లోని హైటెక్స్​బిల్డింగ్​సమీపంలో గంజాయి తాగుస్తున్నారు. సమాచారం అందుకున్న టీజీ న్యాబ్, మాదాపూర్​పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి 1.5 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.

గంజాయి మత్తుతో జీవితం చిత్తు 

నిందితుల్లో ఒకరైన నవీన్ ​నాయక్ ​బ్రిలియంట్​స్టూడెంట్. ఇతని తండ్రి ప్రభుత్వ ఉద్యోగి. చిన్నప్పటి నుంచి ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా నవీన్​ను పెంచారు. ఇంటర్​వరకు మంచిగా చదివిన నవీన్, 2015లో తమిళనాడు తిరుచిరాపల్లిలోని ఎన్ఐటీలో సీటు సంపాదించాడు. అక్కడ ఫ్రెండ్స్ తో కలిసి చెడు వ్యసనాలకు బానిసయ్యాడు. చదువును పక్కన పెట్టి, తరచూ గంజాయి తీసుకోవడం మొదలుపెట్టాడు. విషయం తెలుసుకున్న నవీన్​తల్లి నెల రోజులపాటు తిరుచిరాపల్లిలో ఉండి కొడుకును చూసుకుంది. అయినప్పటికీ అతనిలో మార్పురాలేదు. ఇంజనీరింగ్​ను మూడో సంవత్సరంలో బంద్​చేసి బెంగుళూరుకు వెళ్లాడు. అక్కడి ప్రైవేట్​కంపెనీలో కొన్నాళ్లు మార్కెటింగ్​ఆఫీసర్​పనిచేశాడు.

 వివిధ రాష్ట్రాలకు తిరుగుతూ గంజాయి సప్లయర్లతో పరిచయాలు పెంచుకున్నాడు. డబ్బుల కోసం తోటి ఉద్యోగులకు, సాఫ్ట్​వేర్​ ఉద్యోగులకు గంజాయి, ఎండీఎంఏ అమ్మడం మొదలుపెట్టాడు. 2022లో సిటీలోని దుండిగల్​ లో ఎండీఎంఏ అమ్ముతూ పోలీసులకు చిక్కాడు. 2023లో కేరళలోని పాలక్కడ్​పోలీసులకు దొరికాడు. నవీన్​పరిస్థితిని చూసి తట్టుకోలేకపోయిన తల్లిదండ్రులు అనారోగ్యానికి గురయ్యారు. తాను గంజాయికి బానిసై ఏడేండ్లుగా ఇంటికి పోలేదని, తల్లిదండ్రులకు దూరంగా ఉంటున్నానని పోలీసుల విచారణలో నవీన్ ​చెప్పాడు.