కృష్ణా నదిలో ఈతకు వెళ్లి ఐదుగురు విద్యార్థుల గల్లంతు

కృష్ణా నదిలో ఈతకు వెళ్లి ఐదుగురు విద్యార్థుల గల్లంతు

విజయవాడ : కృష్ణా నదిలో ఈతకు వెళ్లిన ఐదుగురు విద్యార్థులు గల్లంతయ్యారు. యనమలకుదురు సమీపంలో ఈ ఘటన జరిగింది. ఈతకు దిగి గల్లంతైన ఐదుగురు విద్యార్థుల్లో ఒకరి మృతదేహాన్ని వెలికి తీశారు. మిగిలిన నలుగురు విద్యార్థుల ఆచూకీ దొరకలేదు. 

ప్రమాదం గురించి తెలిసిన వెంటనే పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని రెస్క్యూ బృందాన్ని రంగంలోకి దింపి గాలింపు చర్యలు చేపట్టారు. బాధితులు విజయవాడ పటమట ప్రాంతానికి చెందిన విద్యార్థులుగా గుర్తించారు. విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌ కూడా ఘటనా స్థలికి చేరుకుని అధికారులతో కలసి సహాయక చర్యలను పర్యవేక్షించారు. 

సరదా కోసం ఈతకు దిగిన ఒక విద్యార్థి నీటిలో మునిగిపోతుండడం గుర్తించి ఒడ్డున ఉన్న మిగిలిన నలుగురు విద్యార్థులు అతన్ని కాపాడేందుకు వెళ్లినట్లు తెలుస్తోంది. విద్యార్థులు కృష్ణా నదిలో గల్లంతైన ఘటనతో బాధితుల తల్లిదండ్రులు, ఇతర కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు ఘటనా స్థలానికి చేరుకుని గుండెలవిసేలా రోదిస్తుండడంతో ఈ ప్రాంతంలో విషాదం నెలకొంది.