గ్రేటర్ పరిధిలో ఫ్లెక్సీలు, హోర్డింగ్ పై నిషేధం ఉన్నా వాటిని ఏర్పాటు చేస్తూనే ఉన్నారు. ప్రకటనదారులు, రాజకీయ నేతలు, వివిధ ప్రైవేటు కంపెనీల వారు ఫ్లెక్సీలు, హోర్డింగ్ లను ఏర్పాటు చేస్తున్నారు. ఫ్లెక్సీలు, హోర్డింగ్లపై జీహెచ్ఎంసీ అధికారులు మొదట తనిఖీలు ప్రారంభించి తర్వాత పట్టించుకోకపోవడంతో ఫ్లెక్సీలు, హోర్డింగ్ లు ఏర్పాటవుతున్నాయి. వాహనదారులకు ఇవి ప్రమాదకరంగా మారుతున్నాయి. చెన్నైలో డివైడర్పై పెట్టిన ఫ్లెక్సీ బ్యానర్ స్కూటీపై వెళ్తున్న యువతిపై పడి ఆమె మృతి చెందిన ఘటనపై ఆ రాష్ట్ర హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. మన సిటీలో ఇలాంటి ఘటనలు జరగకుండా జీహెచ్ఎంసీ అధికారులు మందస్తు చర్యలు చేపట్టడం లేదు. ఆ మధ్య అమీర్పేట్లో కోచింగ్ సెంటర్లు రోడ్ల మీద, ఫుట్పాత్ల పైన ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను అధికారులు తొలగించారు. 2 రోజుల పాటు స్పెషల్ డ్రైవ్ నిర్వహించి ఆ తర్వాత అటకెక్కించారు. ఒక్క ఖైరతాబాద్ జోన్ మైత్రివనం జంక్షన్లోని ప్రాంతంలో అధికారులు చర్యలు తీసుకున్నారు.
రూల్స్ ప్రకారం..
ప్రధాన రహదారులు, జంక్షన్లు, విద్యుత్ స్తంభాలపై ఏర్పాటు చేసిన అక్రమ ఫ్లెక్సీలు, బ్యానర్లను తొలగించడంలో జీహెచ్ఎంసీ నిర్లక్ష్యం వహిస్తోంది. గోడలపైన, బస్షెల్టర్లు సెంట్రల్ డివైడర్లు, మెట్రో స్టేషన్లపై ప్రచార పోస్టర్లు, పాంప్లెట్లు అతికించే సంస్థలు, వ్యక్తులను గుర్తించి భారీ ఫైన్ లు విధించాల్సి ఉంటుంది. అక్రమంగా పోస్టర్లు, ఫ్లెక్సీలు కనిపిస్తే మెడికల్ ఆఫీసర్లు, శానిటరీ ఫీల్డ్ అసిస్టెంట్లను బాధ్యులుగా చేస్తామని మున్సిపల్ చీఫ్ సెక్రటరీ అర్వింద్ కుమార్ జనవరిలో ఆదేశించారు. పబ్లిక్ డిఫేస్మెంట్ చట్టాన్ని కఠినంగా అమలు చేయాలని సూచించినా జీహెచ్ఎంసీ అధికారులు పట్టించుకోవడం లేదు.