నేలకూలింది.. కాలిపోయింది

నేలకూలింది..  కాలిపోయింది

అఫ్గానిస్తాన్​లో ప్లేన్​ క్రాష్.. 83 మంది చనిపోయారని అనుమానం

ఏరియానా ఎయిర్​లైన్స్ దేనంటూ ప్రచారం.. తమ విమానాలన్నీ సేఫ్ ​అంటూ కంపెనీ ప్రకటన

అఫ్గాన్​లో సోమవారం ఓ విమానం​ కూలిపోయింది. ఘజ్నీ ప్రావిన్స్​లో ఈ ప్రమాదం జరిగింది. నేలను తాకిన వెంటనే మంటలు అంటుకుని, కాలిపోయింది. విమానంలో ప్రయాణిస్తున్న వారు ఎవరూ ప్రాణాలతో బయటపడే అవకాశంలేదని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. కూలిపోయిన విమానం అఫ్గాన్​ ఏరియానా ఎయిర్​లైన్స్​కు చెందిందని, ప్రమాదం జరిగిన టైంలో అందులో 83 మంది ప్రయాణిస్తున్నారని లోకల్​ అధికారులు చెప్పారు. వీరంతా ప్రాణాలు కోల్పోయారని తెలుస్తోంది. అయితే, ఈ వార్తలను  ఏరియానా అఫ్గాన్​ ఎయిర్​లైన్స్​ కొట్టిపారేసింది.  తమ విమానాలన్నీ సేఫ్​గానే ఉన్నాయని, క్రాష్​ అయిన విమానం తమది కాదని ఓ ప్రకటన విడుదల చేసింది. అఫ్గాన్​ సివిల్​ ఏవియేషన్​ అథారిటీ కూడా దీనిని కన్ఫర్మ్​ చేసింది. ఘజ్నీ ప్రావిన్స్​లో కమర్షియల్​ ఫ్లైట్​ కూలిపోయినట్లు తమకు ఎలాంటి సమాచారం అందలేదని తెలిపింది. విమానం కూలిపోయిన విషయాన్ని ఘజ్నీ గవర్నర్ అధికార ప్రతినిధితో పాటు, లోకల్​ పోలీసులు కూడా కన్ఫర్మ్ చేశారు. ఘజ్నీ ప్రావిన్స్ లోని చాలా గ్రామాలు తాలిబన్​ మిలిటెంట్ల ఆధీనంలో ఉండడంతో ఈ ప్రమాదానికి సంబంధించి వివరాలు తెలుసుకోవడం కష్టమవుతోందని అధికారులు చెప్పారు. ఈ ఘటనపై తాలిబన్ల ప్రతినిధి స్పందిస్తూ.. ప్రమాదం జరిగిన ప్రాంతంలో విచారణ చేస్తున్నట్లు తెలిపారు. మరోవైపు, సోషల్​ మీడియాలో సర్క్యులేట్​ అవుతున్న యాక్సిడెంట్ ఫోటోలను పరిశీలిస్తే కూలిపోయిన విమానం అమెరికన్​ ఎయిర్​క్రాఫ్ట్​లాగా ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో ప్లేన్​ క్రాష్​ ఘటనపై విచారణ జరుపుతున్నట్లు అమెరికా కంట్రోల్​ కమాండ్ అధికార ప్రతినిధి మేజర్​ బెత్​ రియోర్డన్​ చెప్పారు.

అక్కడ ప్రమాదాలు కామనే..

అఫ్గాన్​లో మిలిటరీ ఎయిర్​ క్రాఫ్ట్​లు.. ముఖ్యంగా హెలికాప్టర్ ప్రమాదాలు ఎక్కువని అధికారులు చెప్పారు. వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేకపోవడం, కాలంచెల్లినా సరే విమానాలను, హెలికాప్టర్లను ఉపయోగించడం వల్ల అక్కడ తరచూ ప్రమాదాలు జరుగుతుంటాయి. 2013లో అమెరికన్​ బోయింగ్​ 747 కార్గో విమానం టేకాఫ్​ అయిన కాసేపటికే కూలిపోయింది. నార్త్​ కాబూల్​ నుంచి దుబాయ్​ వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో విమానంలోని ఏడుగురు సిబ్బంది చనిపోయారు. 2010లో పామిర్ ఎయిర్​వేస్​కు చెందిన ప్యాసింజర్​ ప్లేన్​ క్రాష్​ ల్యాండ్​ అయింది. కుందుజ్​ నుంచి కాబూల్​ వెళుతుండగా బ్యాడ్​ వెదర్​ కారణంగా ఈ ప్లేన్​ కూలిపోయింది. ఈ విమానంలోని 38 మంది ప్రయాణికులతో పాటు ఆరుగురు సిబ్బంది చనిపోయారు.

వెలుగు వార్తలకోసం క్లిక్ చేయండి