ఎంప్లాయిస్ కు ఫ్లిప్కార్ట్ భరోసా
బెంగళూరు: కరోనా వల్ల లాక్డౌన్ కొనసాగుతుండటంతో అన్ని కంపెనీలు ఉద్యోగాల జీతాల కోతలు, లేఆఫ్స్ ప్రకటిస్తోన్న క్రమంలో.. ఈ–కామర్స్ కంపెనీ ఫ్లిప్కార్ట్ తన ఉద్యోగులకు భరోసా ఇచ్చింది. ఎలాంటి వేతన కోతలు లేదా లేఆఫ్స్ ఉండవని ఫ్లిప్కార్ట్ గ్రూప్ సీఈఓ కల్యాణ్ కృష్ణమూర్తి హామీ ఇచ్చారు. ఈ కంపెనీకి చెందిన 8 వేల మంది ఉద్యోగులతో కల్యాణ్ కృష్ణమూర్తి తొలిసారి వర్చువల్ టౌన్ హాల్ మీటింగ్ నిర్వహించారు. ముందుగా నిర్ణయించిన ప్రకారం ప్రోత్సాహకాలు ఇస్తామని, ఉద్యోగులపై లాక్డౌన్ ప్రభావం ఉండదన్నారు. కంపెనీ ఉద్యోగ ఆఫర్లు కూడా ఇస్తుందని, ఇంటర్న్ షిప్లను ఆహ్వానిస్తోందని తెలిపారు. తమ కమిట్మెంట్ను, నిజాయితీని చూపించడానికి ఈ సంక్షోభమే సరియైన సమయమని అన్నారు. ఉద్యోగులందరూ సురక్షితంగా, ఆరోగ్యంగా, భాద్యతాయుతంగా ఉండాలని సూచించారు. జాతినిర్మాణంలో తమ వంతు సాయం చేయాలని కోరారు. మేలో ఫెస్టివ్ సేల్ నిర్వహించే ప్లాన్స్ ఏమన్నా ఉన్నాయా..? అని ఉద్యోగి అడుగగా… అవకాశం ఉంటే చూద్దామని జవాబిచ్చారు.
200 బిలియన్ డాలర్లకు ఈ-కామర్స్ మార్కెట్..
అమెజాన్, రిలయన్స్ ఈ–కామర్స్ వెంచర్ జియోమార్ట్ తో పోటీ పడుతోన్న ఫ్లిప్కార్ట్ ఆన్ లైన్ ఈ–కామర్స్ మార్కెట్లో టాప్లో ఉంది. 2018 నాటికి 30 బిలియన్ డాలర్లుగా ఉన్న ఈ–కామర్స్ మార్కెట్ , 2028 నాటికి 200 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని అంచనాలున్నాయి. మార్చి 16 వరకు కన్జూమర్ రిటైల్ సేల్స్ ఏం తగ్గలేదని క్యాపిలరీ టెక్నాలజీస్ స్టడీ తెలిపింది. కరోనా వైరస్ ఇప్పుడు దేశంలో మూడో దశకు చేరుకుంది. ఇండియాలో బీభత్సం సృష్టిస్తోంది. దీంతో దేశవ్యాప్తంగా ప్రభుత్వం లాక్డౌన్ విధించింది. లాక్డౌన్ కారణంతో ప్రజలందరూ కిరాణాలు, ఈ–కామర్స్ ప్లాట్ఫామ్స్ పైనే ఆధారపడుతున్నారు. ఈ–కామర్స్ కంపెనీలు కూడా అత్యవసర వస్తువులనే ప్రజలకు అందిస్తున్నాయి. లాక్డౌన్ కారణంతో ఈ కంపెనీలకు కూడా మ్యాన్పవర్ కొరత ఏర్పడింది.
For More News..