హైదరాబాద్, వెలుగు: పోలవరం ముంపు ప్రాంతాల అధ్యయనం కోసం కేంద్రం తలపెట్టిన మీటింగ్ వాయిదా పడింది. పోలవరం ప్రాజెక్టు ఎత్తు పెంపుతో కలిగే ముంపుపై ప్రభావిత రాష్ట్రాలన్నింటితో కలిసి చర్చించాలని కేంద్రాన్ని సుప్రీం ఆదేశించింది. ఈ నేపథ్యంలో కేంద్ర జలశక్తి శాఖ సెక్రటరీ పంకజ్ కుమార్ ఢిల్లీ నుంచి ఒడిశా, చత్తీస్గఢ్, తెలంగాణ, ఏపీ రాష్ట్రాల సీఎస్లు, ఇరిగేషన్ సెక్రటరీలతో బుధవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సమావేశం గురించి తమకు ముందుగా చెప్పలేదని ఒడిశా ఇరిగేషన్ సెక్రటరీ అన్నారు. షార్ట్ నోటీస్తో తమ విన్నపాలన్ని చెప్పుకోలేమన్నారు. సమాచారం ఇచ్చిన మరుసటిరోజు మీటింగ్ ఏర్పాటు చేయాలని కోరారు. అంగీకరించిన పంకజ్ కుమార్ భేటీ వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో రాష్ట్ర ఇరిగేషన్ స్పెషల్ సీఎస్ రజత్ కుమార్ అభిప్రాయాలు చెప్పకుండానే వెనుదిరిగారు.