
- 10 వేల అడుగుల ఎత్తు నుంచి దూకి/(స్కై డైవింగ్ చేసి) రికార్డు
- దేశంలో ఈ ఘనత సాధించిన రెండో వృద్ధ మహిళగా గుర్తింపు
చండీగఢ్: ఎనభై ఏండ్ల బామ్మ సాహసమే చేశారు. 10 వేల అడుగుల ఎత్తు నుంచి స్కై డైవింగ్ చేసి రికార్డుకెక్కారు. ఎప్పటినుంచో ఉన్న తన కోరికను 80వ పుట్టినరోజున విజయవంతంగా నెరవేర్చుకున్నారు. దీంతో హర్యానాలోని నార్నౌల్ ఎయిర్ స్ట్రిప్ వద్ద ఉన్న స్కైహై ఇండియా సెంటర్ నుంచి స్కై డైవ్ చేసిన రెండో అత్యంత వృద్ధ మహిళగా ఆమె గుర్తింపు పొందారు. ఈ సెంటర్ మన దేశంలోనే ప్రభుత్వ గుర్తింపు పొందిన ఏకైక సివిలియన్ డ్రాప్ జోన్ కాగా, ఇందులోనే ఆమె
కొడుకు చీఫ్ ఇన్స్ట్రక్టర్గా పనిచేస్తున్నారు.
కేంద్ర మంత్రి ఇన్స్పిరేషన్గా..
డాక్టర్గా రిటైర్ అయిన 80 ఏండ్ల శ్రద్ధా చౌహాన్.. 2021 జులైలో జరిగిన మొదటి వరల్డ్ స్కై డైవింగ్ డే వేడుకులకు హాజరయ్యారు. ఆ టైంలో కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ స్కై డైవింగ్ చేశారు. అది చూసిన శ్రద్ధా చౌహాన్ తానెందుకు చేయకూడదని తన కొడుకుతో అన్నారు. అప్పటి కోరిక తన 80 వ పుట్టినరోజున కొడుకు ప్రోత్సాహంతో శ్రద్ధా చౌహాన్ నెరవేర్చుకున్నారు.
అయితే, స్కై డైవింగ్కు తాను రెడీగా ఉన్నప్పటికీ.. తన భర్త, రెండో కొడుకు వద్దని చెప్పారని శ్రద్ధ తెలిపారు. ఈ వయసులో ఇదేం పనంటూ తన నిర్ణయాన్ని వ్యతిరేకించారని పేర్కొన్నారు. స్కై హై ఇండియాలో చీఫ్ ఇన్స్ట్రక్టర్గా పనిచేస్తున్న తన పెద్ద కొడుకు ప్రోత్సాహంతో స్కైడైవింగ్ పూర్తిచేశానని అన్నారు. ‘గాల్లో ఎగురుతుండగా నాకు భయం వేయలేదు. ఏ ఆలోచన లేని స్థితిలోకి వెళ్లిపోయాను’ అని చెప్పారు.
తాను రెగ్యులర్గా యోగా చేస్తానని, డైవింగ్ చేయాలనుకునేవారు ఆరోగ్యంగా ఉండటం అవసరమని సూచించారు. చీఫ్ ఇన్స్ట్రక్టర్గా తన తల్లితో కలిసి స్కై డైవింగ్ చేసే అదృష్టం లభించిందని ఆమె కొడుకు సంతోషం వ్యక్తం చేశారు.