న్యూఢిల్లీ: చలికాలం స్టార్టవ్వడంతో వింటర్కు సంబంధించిన ప్రొడక్ట్ల సేల్స్ ఊపందుకుంటాయని ఎఫ్ఎంసీజీ కంపెనీలు భావిస్తున్నాయి. ఉష్ణోగ్రతలు పడే కొద్దీ వీటి అమ్మకాలు మరింతగా పెరుగుతాయని చెబుతున్నాయి. రూరల్ ఏరియాల్లో ఇటువంటి టైప్ ప్రొడక్ట్ల సేల్స్ ఎక్కువగా జరుగుతాయని డాబర్, ఇమామీ, మారికో వంటి ఎఫ్ఎంసీజీ కంపెనీలు వివరించాయి. స్కిన్ కేర్ నుంచి ఇమ్యూనిటీ వరకు వివిధ సెగ్మెంట్లలో వింటర్ ప్రొడక్ట్లను ఈ కంపెనీలు తీసుకొస్తున్నాయి.
మరోవైపు ఇన్ఫ్లేషన్ తగ్గుముఖం పడుతుండడం, పంటల దిగుబడి బాగుండడంతో గ్రామీణ ప్రాంతాల్లో సేల్స్ రికవర్ అవుతాయని కంపెనీలు అంచనా వేస్తున్నాయి. ఈ–కామర్స్, ఇతర మోడర్న్ విధానాల ద్వారా వింటర్ ప్రొడక్ట్ల అమ్మకాలు పెరుగుతున్నాయని పేర్కొన్నాయి. బాడీ లోషన్, సఫోలా ఇమ్యూనివేదా వంటి తమ ప్రొడక్ట్లకు వింటర్ సీజన్ చాలా కీలకమని మారికో సీఓఓ (ఇండియా బిజినెసెస్) సంజయ్ మిశ్రా పేర్కొన్నారు. ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో సేల్స్ ఎక్కువగా జరుగుతాయని చెప్పారు. ‘వింటర్ సీజన్లోకి ఎంటర్ అవ్వడంతో ఈ ఏడాది కూడా ఈ రెండు ప్రొడక్ట్ల వినియోగం పెరుగుతుంది’ అని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ–కామర్స్, ఇతర ఆధునిక మార్గాల ద్వారా తమ వింటర్ హెయిర్ ఆయిల్ ప్రొడక్ట్లకు డిమాండ్ పెరగడాన్ని చూస్తున్నామని వివరించారు. సఫోలా హనీ, సఫోలా ఇమ్యూనివేదా చ్యవన్ప్రాశ్ వంటి ప్రొడక్ట్లకు డిమాండ్ పెరిగిందని అన్నారు. వింటర్ సీజన్ను దృష్టిలో పెట్టుకొని డాబర్ చ్యవన్ప్రాశ్, డాబర్ హనీ, గులాబరీ వంటి కొన్ని ప్రొడక్ట్లను రెడీ చేశామని డాబర్ ఇండియా సీఓఓ ఆదర్శ్ శర్మ అన్నారు. ‘ఇంకా వింటర్ సీజన్లో స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నాం. డిమాండ్ నిలకడగా ఉంది. ఈ శీతాకాలం బాగుంటే వింటర్ ప్రొడక్ట్లకు డిమాండ్ మరింత పెరగడం చూస్తాం’ అని పేర్కొన్నారు. ఈ ఏడాది శీతాకాలంపై ఇమామీ ఎక్కువ ఆశలు పెట్టుకుంది. ఇన్ఫ్లేషన్ సమస్యలు ఉన్నప్పటికీ రూరల్ ప్రాంతాల్లో, హోల్సేల్ మార్కెట్లలో వింటర్ ప్రొడక్ట్లు మంచి పెర్ఫార్మెన్స్ చేస్తాయని ఇమామీ సీసీడీ ప్రెసిడెంట్ వినోద్ రావు అన్నారు. చిన్న, మధ్యస్థాయిల్లోని ప్యాక్ల సేల్స్ పెరుగుతాయని అంచనావేశారు. గతేడాదితో పోలిస్తే పెద్ద ప్యాక్ల అమ్మకాలూ ఊపందుకుంటాయని అన్నారు. కాగా, బోరోప్లస్ బ్రాండ్ ఇమామీకి చెందిందే.