న్యూఢిల్లీ, వెలుగు: ప్రభుత్వ బ్యాంకుల్లో ఎస్సీ(షెడ్యూల్డ్ కులాల) బ్యాక్లాగ్ పోస్టుల భర్తీపై స్పెషల్ డ్రైవ్ చేపట్టాలని కేంద్రం నిర్ణయించినట్లు నేషనల్ ఎస్సీ కమిషన్ చైర్మన్ విజయ్ సాంప్లా వెల్లడించారు. అక్టోబర్ 2 నుంచి డిసెంబర్ 31 వరకు జరగనున్న ఈ ప్రత్యేక డ్రైవ్లో అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులు పాల్గొంటాయని బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. తాజాగా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్తో కలిసి ప్రభుత్వ రంగ బ్యాంకుల పనితీరుపై సమీక్ష నిర్వహించినట్లు విజయ్ సాంప్లా చెప్పారు. ఎస్సీలకు సంబంధించిన క్రెడిట్, ఇతర సంక్షేమ పథకాల అమలుపై చర్చించి.. స్పెషల్ డ్రైవ్ పై నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు.
డ్రైవ్-లో భాగంగా అక్టోబర్ 31 వరకు పెండింగ్-లో ఉన్న ఎస్సీల ఫిర్యాదులను పరిష్కరించాలని బ్యాంకులను ఆదేశించారు. ఎస్సీ లబ్ధిదారులకు కేటాయించిన వాటాను సాధించడానికి లక్ష్యాన్ని నిర్దే శించుకోవాలన్నారు. ముఖ్యంగా స్టాండ్ అప్ ఇండియా, ముద్ర, స్వాభిమాన్ ఆవాస్ యోజన, ఎన్ఆర్ఎల్ఎం, ఎన్యూఎల్ఎం వంటి పథకాలకు అమలుపై ఫోకస్ పెట్టాలని సూచించారు. బ్యాంకులు, షెడ్యూల్ కులాల అభివృద్ధికి లక్ష్యాలను నిర్దేశించుకొని అమలు చేయాలని విజయ్ సాంప్లా పేర్కొన్నారు.