టెస్టు ప్లేయర్లపై ఫోకస్‌‌‌‌‌‌‌‌.. నేటి నుంచి ఇంగ్లండ్ లయన్స్‌‌‌‌‌‌‌‌తో ఇండియా–ఎ మ్యాచ్‌‌‌‌‌‌‌‌

టెస్టు ప్లేయర్లపై ఫోకస్‌‌‌‌‌‌‌‌.. నేటి నుంచి ఇంగ్లండ్ లయన్స్‌‌‌‌‌‌‌‌తో ఇండియా–ఎ మ్యాచ్‌‌‌‌‌‌‌‌

వచ్చే నెలలో ఐదు టెస్టుల సిరీస్‌‌‌‌‌‌‌‌ కోసం టీమిండియా.. ఇంగ్లండ్‌‌‌‌‌‌‌‌లో పర్యటించనుండగా అక్కడి వాతావరణం, పరిస్థితులకు అలవాటు పడేందుకు ఓపెనర్ యశస్వి జైస్వాల్, ఆల్‌‌‌‌‌‌‌‌రౌండర్ నితీష్ కుమార్ రెడ్డితో సహా పలువురు ఆటగాళ్లు ఇండియా–ఎ టీమ్ తరఫున ముందుగానే ‘టెస్టు’ సవాల్‌కు సిద్ధమయ్యారు.  శుక్రవారం ఇంగ్లండ్‌‌‌‌‌‌‌‌ లయన్స్‌‌‌‌‌‌‌‌తో మొదలయ్యే తొలి  నాలుగు- రోజుల అనధికారిక టెస్టు ద్వారా ఇక్కడి పరిస్థితులకు అలవాటు పడాలని చూస్తున్నారు. జైస్వాల్, నితీష్‌‌‌‌‌‌‌‌తో పాటు అభిమన్యు ఈశ్వరన్, ధ్రువ్ జురెల్, కరుణ్ నాయర్, పేసర్లు ఆకాశ్ దీప్, శార్దూల్ ఠాకూర్ వంటి ఆటగాళ్లు కూడా ఇండియా–ఎ టీమ్‌‌‌‌‌‌‌‌లో ఉన్నారు. జూన్ 20 నుంచి ఇంగ్లండ్‌‌‌‌‌‌‌‌తో జరిగే టెస్ట్ సిరీస్‌‌‌‌‌‌‌‌కు ముందు ఇక్కడి స్వింగ్‌‌‌‌‌‌‌‌కు అనుగుణంగా తమ ఆటను మలుచుకోవాలని వీరంతా భావిస్తున్నారు. 

కరుణ్ నాయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మినహా కుర్రాళ్లకు ఇదే తొలి ఇంగ్లండ్ టూర్ కావడంతో లయన్స్‌‌‌‌‌‌‌‌తో రెండు అనధికారిక టెస్టుల మ్యాచ్‌‌‌‌‌‌‌‌లు వారికి కీలకం కానున్నాయి. ఇండియా–ఎ టీమ్‌‌‌‌‌‌‌‌లోని పలువురు ప్లేయర్లు టీమిండియా టెస్టు టీమ్‌‌‌‌‌‌‌‌కు కూడా ఎంపికయ్యారు.  రోహిత్ శర్మ రిటైర్మెంట్ తర్వాత జైస్వాల్‌‌‌‌‌‌‌‌తో కలిసి ఓపెనింగ్ చేసేందుకు ఒక ఓపెనర్ విరాట్ కోహ్లీ ప్లేస్‌లో నం.4లో ఆడేందుకు మరో బ్యాటర్ అవసరం. ఓపెనర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్లాట్ కోసం 101 ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌‌‌‌‌‌‌‌ల అనుభవం ఉన్న ఈశ్వరన్ రేసులో ఉన్నాడు.  గతంలో  టెస్టు టీమ్‌‌‌‌‌‌‌‌లోకి వచ్చినా తుది జట్టులో చాన్స్‌‌‌‌‌‌‌‌ అందుకోలేకపోయాడు. ఇప్పుడు రోహిత్ రిటైర్మెంట్‌‌‌‌‌‌‌‌ తో ఖాళీ ఏర్పడటంతో ఓపెనర్‌‌‌‌‌‌‌‌ లేదా మూడో నంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఆడేందుకు రెడీగా ఉండాలని చూస్తున్నాడు. ఇక దేశవాళీల్లో అదరగొట్టి ఎనిమిదేండ్ల తర్వాత నేషనల్ టీమ్‌‌‌‌‌‌‌‌లో రీఎంట్రీ ఇస్తున్న కరుణ్ నాయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పైనా అందరి ఫోకస్ ఉండనుంది. ఈ సీనియర్ బ్యాటర్ మిడిలార్డర్‌‌‌‌‌‌‌‌లో ప్లేస్‌‌‌‌‌‌‌‌ కోసం పోటీ పడుతున్నాడు. 

ఇప్పటికే  నార్తాంప్టన్‌‌‌‌‌‌‌‌షైర్ తరఫున కౌంటీ క్రికెట్ ఆడిన అతనికి ఇక్కడి పరిస్థితులపై మంచి అవగాహన ఉంది. బోర్డర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌–గావస్కర్ ట్రోఫీలో ఆకట్టుకున్న నితీష్‌‌‌‌‌‌‌‌.. ఇంగ్లండ్ సవాల్‌‌‌‌‌‌‌‌కు కూడా సిద్ధం కావాలని చూస్తున్నాడు. ఇక, చాన్నాళ్ల తర్వాత టెస్టు జట్టులోకి వచ్చిన పేస్ ఆల్‌‌‌‌‌‌‌‌రౌండర్ శార్దూల్ ఠాకూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇంగ్లండ్ లయన్స్‌‌‌‌‌‌‌‌పై రాణించి టీమిండియా ఫైనల్‌‌‌‌‌‌‌‌ ఎలెవెన్‌‌‌‌‌‌‌‌లో చోటును కోరుకుంటున్నాడు. వికెట్ కీపర్ బ్యాటర్ ధ్రువ్ జురెల్‌తో పాటు  సర్ఫరాజ్ ఖాన్, ఇషాన్ కిషన్‌‌‌‌‌‌‌‌, స్పిన్నర్ తనుష్ కోటియన్‌‌‌‌‌‌‌‌ కూడా సత్తా చాటేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇంగ్లండ్ సీనియర్ టీమ్ ప్లేయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జోర్డాన్ కాక్స్ లయన్స్ కెప్టెన్‌‌‌‌‌‌‌‌గా వ్యవహరిస్తున్నాడు.  టెస్ట్ రెగ్యులర్ ప్లేయర్లయిన  స్పిన్నర్ రెహాన్ అహ్మద్, ఆల్‌‌‌‌‌‌‌‌రౌండర్ క్రిస్ వోక్స్ కూడా లయన్స్ జట్టులో ఉన్నారు.