
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఆహార కల్తీని అరికట్టాలని సీఎం రేవంత్ రెడ్డిని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ అధ్యక్షుడు పద్మనాభ రెడ్డి కోరారు. అన్ని అర్బన్ ఏరియాలతో పాటు జీహెచ్ ఎంసీలో ఈ సమస్య మరింత ఎక్కువగా ఉందని ఆయన తెలిపారు. ఈ అంశంపై మంగళవారం సీఎం రేవంత్ రెడ్డికి పద్మనాభరెడ్డి లేఖ రాశారు. ఆహారకల్తీ ప్రజలకు పెద్ద సమస్యగా తయారైందని, కల్తీని అరికట్టడానికి కేంద్రం ఆహారభద్రతా చట్టాన్ని తీసుకొచ్చినా అది సరిగ్గా అమలు కావడం లేదన్నారు.
చట్టం ప్రకారం కల్తీకి పాల్పడితే 6 నుంచి 7 ఏండ్ల జైలు శిక్ష ఉంటుందని తెలిపారు. ఫుడ్ ఇన్ స్పెక్టర్లు, పోలీసులు దాడులు చేస్తూ కేసులు బుక్ చేస్తున్నా.. నిందితులు వెంటనే బయటకు వస్తున్నారని, కోర్టుల్లో కేసులు వీగిపోతున్నాయని లేఖలో పద్మనాభరెడ్డి పేర్కొన్నారు. జీహెచ్ ఎంసీ పరిధిలో కేసులు నమోదవుతున్నా అతి తక్కువ టైమ్ లో
నిందితులు బయటకు వస్తున్నారని, తక్కువ జరిమానాలు విధిస్తుండడంతో అవి చెల్లించి బయటకు వస్తున్నారని ఆయన గుర్తు చేశారు. ఆహార కల్తీపై నమోదైన కేసులు త్వరితగతిన పూర్తి కావడానికి ప్రత్యేక కోర్టును ఏర్పాటు చేయాలని, ఫుడ్ ఇన్స్ పెక్టర్లను నియమించాలని సీఎంను పద్మనాభరెడ్డి కోరారు.