హైదరాబాద్, వెలుగు: వెల్లూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (వీఐటీ) ఏపీకి చెందిన బీ.టెక్ (కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్) స్టూడెంట్ దొడ్డి సుధాన్షు యూఎస్కు చెందిన ప్రముఖ అనలిటిక్స్ కంపెనీలో రూ. 63 లక్షల ప్యాకేజీతో ఉద్యోగాన్ని సాధించాడు. ఈ యూనివర్శిటీ వైస్ ఛాన్సలర్ ఎస్.వి. కోట రెడ్డి మాట్లాడుతూ.. వీఐటీ -ఏపీ అనుసరిస్తున్న అత్యుత్తమ విద్యా విధానాలు, విద్యార్థుల పట్టుదల వల్లే ఇటువంటి పెద్ద విజయాలను సాధించగలుగుతున్నామని అన్నారు. ప్రపంచానికి బాధ్యతగల రేపటితరం నాయకులను అందించటానికి వీఐటీ -ఏపీ కృషి చేస్తుందని పేర్కొన్నారు. ఈ నెల 24 నాటికి మొత్తం 627 మంది వీఐటీ -ఏపీ స్టూడెంట్లకు 1175 ఉద్యోగ అవకాశాలు వచ్చాయని, ఇందులో 246 సూపర్ డ్రీం ఆఫర్స్ కాగా, 354 డ్రీం ఆఫర్స్ అని అన్నారు. అత్యధిక శాలరీ ప్యాకేజి ఏడాదికి రూ. 63 లక్షలు కాగా, గత ఏడాదితో పోలిస్తే ఇది రూ. 20 లక్షలు ఎక్కువని తెలిపారు. ఈ ఏడాది విద్యార్థుల సగటు శాలరీ ప్యాకేజి రూ. 7.3 లక్షలుగా ఉందని అన్నారు. కిందటేడాది ఇది రూ. 6.77 లక్షలని పేర్కొన్నారు.