- చివర్లో ఆదుకున్న నార్సింగి
- బీజేపీ గెలుపులో కీలకంగా మూడు మండలాలు
సిద్దిపేట, మెదక్, వెలుగు: అచ్చు క్రికెట్ మ్యాచ్ను తలపిస్తూ రాష్ట్ర ప్రజల్ని తీవ్ర ఉత్కంఠకు గురిచేసింది దుబ్బాక రిజల్ట్. బీజేపీకి దుబ్బాక మండలం మంచి ఓపెనింగ్ ఇస్తే చివరి రౌండ్లలో జరిగిన చేజింగ్ లో చేగుంట, నార్సింగి మండలాలు ఆదుకున్నాయి. దుబ్బాక బై ఎలక్షన్స్ లో అధికార టీఆర్ఎస్, బీజేపీ మధ్య హోరాహోరీ పోరు జరిగింది. మొదట్లో దుబ్బాక మండలం బీజేపీకి గట్టి పునాది వేయగా మధ్యలో పరిస్థితి కొంత టీఆర్ఎస్కు అనుకూలంగా మారింది. నంబర్గేమ్లో వెనుకబడిన బీజేపీని చివర్లో చేగుంట, నార్సింగి మండలాలు ఆదుకొని గెలుపుతీరానికి చేర్చాయి. ఈ బైఎలక్షన్స్లో లక్షా 64వేల186 ఓట్లు పోల్ కాగా, 23 రౌండ్లలో లెక్కించారు. నియోజకవర్గంలో 7 మండలాలు ఉండగా మొదట నియోజకవర్గ కేంద్రం దుబ్బాక టౌన్, రూరల్ మండల ఓట్లు లెక్కవెట్టిన్రు. ఫస్ట్ రౌండ్ నుంచే బీజేపీకి రిజల్ట్స్ అనుకూలంగా రావడం మొదలైంది. 5వ రౌండ్ వరకు బీజేపీకి స్పష్టమైన ఆధిక్యం లభించింది. 10 రౌండ్లలో కలిపి బీజేపీ క్యాండిడేట్ రఘునందన్రావు.. టీఆర్ఎస్ క్యాండిడేట్ సోలిపేట సుజాత కంటే 4 వేల ఓట్ల ఆధిక్యంలో నిలిచారు. దౌల్తాబాద్, రాయపోల్ మండలాల ఓట్ల లెక్కింపు మొదలయ్యాక వరుసగా 14, 15, 16,17,18, 19 రౌండ్లలో టీఆర్ఎస్ క్యాండిడేట్కు లీడ్ వచ్చి, బీజేపీ ఆధిక్యత తగ్గింది. 19వ రౌండ్ పూర్తయ్యే సరికి టీఆర్ఎస్ క్యాండిడేట్ దాదాపు 250 ఓట్ల ఆధిక్యంలో నిలిచారు. చివరగా మెదక్ జిల్లా పరిధిలోని చేగుంట, నార్సింగి మండలాల్లో ఏ పార్టీకి మెజారిటీ ఓట్లు వస్తాయానే దానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఆ మండలాల ఓట్లను 20, 21, 22, 23 రౌండ్ లలోనూ బీజేపీకి లీడ్ రావడంతో రఘునందన్ను విజయం వరించింది.