ఛార్జర్లు లేకుండా ఐఫోన్లను విక్రయించినందుకు బ్రెజిలియన్ కోర్టు యాపిల్కు $20 మిలియన్(దాదాపు రూ.164కోట్లు.) జరిమానా విధించింది. ఎక్కువ ఫోన్లను వినియోగదారులకు అమ్మాలని చేసే దురుద్దేశంలో భాగమే ఈ పద్దతి అని ఆరోపించారు. ఇలా యాపిల్ కు ఫైన్ వేయడం ఇదేం మొదటిసారి కాదు. ఛార్జర్ లేకుండా ఐఫోన్ అమ్మొద్దని బ్రెజిల్ ప్రభుత్వం అప్పటికే యాపిల్ సంస్థను ఆదేశించింది. ఈ మేరకు అఫిషియల్ గెజిట్లోనూ ఆ విషయాన్ని పేర్కొంది. ఇది తెలిసినప్పటికీ ఆ సంస్థ ఉద్దేశపూర్వకంగానే వినియోగదారులపై వివక్ష చూపినట్లు అప్పట్లో తప్పుపట్టింది. ఈ తప్పు చేసినందుకు గానూ 2.5 మిలియన్ డాలర్ల జరిమానా కూడా విధించింది. ఇక మీదట ఛార్జర్ లేకుండా ఏ ఐఫోన్ మోడల్నీ విక్రయించొద్దని తేల్చిచెప్పింది.
గత వారమే యూరోపియన్ పార్లమెంట్ 2024 చివరి నుండి అన్ని స్మార్ట్ఫోన్లు, టాబ్లెట్లు, కెమెరాలు USB-C పోర్ట్లను సింగిల్ ఛార్జర్ ప్రమాణంగా ఉపయోగించాలని ఒక చట్టాన్ని ఆమోదించింది. ఇదే గనక అమలైతే యాపిల్ తన ఫోన్ డిజైన్లను మార్చవలసి వస్తుంది.