
- గత ఏడాది కాలంలో 20 శాతం అప్
న్యూఢిల్లీ: ఇండియన్ కంపెనీల్లో విదేశీ పోర్టుఫోలియో ఇన్వెస్టర్ల (ఎఫ్పీఐల) పెట్టుబడులు పెరుగుతున్నాయి. ఈ ఏడాది జూన్ నాటికి ఈక్విటీ మార్కెట్లో ఎఫ్పీఐలు ఇన్వెస్ట్ చేసిన పెట్టుబడులు 626 బిలియన్ డాలర్ల (రూ.55.33 లక్షల కోట్ల) కు చేరుకున్నాయి. ఏడాది క్రితంతో పోలిస్తే ఇది 20 శాతం ఎక్కువ. ఎఫ్పీఐలు ఇన్ఫోసిస్, ఎల్ అండ్ టీ వంటి చాలా కంపెనీల్లో పెట్టుబడులు పెట్టారు.
మార్నింగ్ స్టార్ రిపోర్ట్ ప్రకారం, కిందటేడాది జూన్ నాటికి ఈక్విటీ మార్కెట్లో ఎఫ్పీఐల పెట్టుబడులు 523 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. ఈ ఏడాది మార్చి క్వార్టర్తో పోలిస్తే ఎఫ్పీఐల పెట్టుబడులు 542 బిలియన్ డాలర్ల నుంచి 15 శాతం పెరిగాయి. ఫలితంగా కంపెనీల మార్కెట్ క్యాప్ కూడా పెరుగుతోంది. దేశ మార్కెట్ క్యాపిటలైజేషన్లో ఎఫ్పీఐల వాటా మార్చి క్వార్టర్లో 17.27 శాతంగా ఉండగా, జూన్ క్వార్టర్ నాటికి 17.33 శాతానికి చేరుకుంది.
భారీగా పెట్టుబడులు..
ఈ ఏడాది జనవరి–మార్చి క్వార్టర్లో దేశ ఈక్విటీ మార్కెట్ల నుంచి 3.2 బిలియన్ డాలర్లను వెనక్కి తీసేసుకున్న ఎఫ్పీఐలు జూన్ క్వార్టర్లో యూటర్న్ తీసుకున్నారు. నికరంగా 12.5 బిలియన్ డాలర్లను ఇన్వెస్ట్ చేశారు. దీంతో స్టాక్ మార్కెట్లు ర్యాలీ చేయడం చూశాం. యూఎస్లో వడ్డీ రేట్లు పెరగడం, గ్లోబల్గా ఇన్ఫ్లేషన్ భయాలు, చైనా ఎకానమీ ఆందోళనలతో ఎఫ్పీఐలు ఇండియా వైపు చూస్తున్నారని మార్నింగ్ స్టార్ రిపోర్ట్ పేర్కొంది.
ఇండియన్ ఎకానమీ స్ట్రాంగ్గా ఉందని, జూన్ క్వార్టర్లో ఇదే మూమెంటం కొనసాగిందని వెల్లడించింది. యూఎస్, యూరప్లో బ్యాంకింగ్ క్రైసిస్ నెలకొనడం, వడ్డీ రేట్ల పెంపును ఫెడ్ ఆపుతుందనే అంచనాలతో జూన్ క్వార్టర్లో ఇండియన్ షేర్ మార్కెట్లోకి విదేశీ ఫండ్స్ భారీగా వచ్చాయని వెల్లడించింది. ఈ ఏడాది మార్చి క్వార్టర్లో మార్కెట్లు పడటంతో, వాల్యుయేషన్స్ కూడా దిగొచ్చాయి.