హైదరాబాద్, వెలుగు : వేటగాళ్ల నుంచి వన్య ప్రాణులను కాపాడేందుకు ‘‘క్యాచ్ ద ట్రాప్’’ పేరిట అటవీ శాఖ స్పెషల్ డ్రైవ్ చేపట్టింది. ఈ డ్రైవ్లో వేటాడేందుకు అవసరమైన వస్తువులను గుర్తించి, వాటిని సీజ్ చేస్తున్నారు. జంతువులపై ప్రయోగించే వలలు, ఉచ్చులు, లైవ్ వైర్లు, విష, పేలుడు పదార్థాలు తదితర వాటిని సీజ్ చేయాలని అధికారులకు ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ (పీసీసీఎఫ్) ఆదేశాలు జారీ చేశారు.
ఈ ప్రత్యేక డ్రైవ్ లో వేటగాళ్లను గుర్తించటం, వారు వాడే పరికరాలను స్వాధీనం చేసుకోవటం, గత రికార్డులు, కేసులను పరిశీలించి అనుమానితులను సోదా చేయటం వంటివి ఫారెస్ట్ అధికారులు చేస్తున్నారు. అడవిని ఆనుకుని ఉండే వ్యవసాయ క్షేత్రాలు, అటవీ పక్కనే ఉన్న గ్రామాలు, ప్రాంతాలను క్షేత్ర స్థాయిలో పరిశీలిస్తారు. వేటకు ఉపయోగించే వస్తువులు లేదా వేట సంబంధిత కార్యకలాపాల సమాచారం తెలిస్తే జిల్లా అటవీ అధికారికి లేదా 98033 38666, టోల్ ఫ్రీ సంబర్ 1800 4255364కు తెలియజేయాలని ప్రజలకు అటవీశాఖ విజ్ఞప్తి చేసింది. సమాచారం ఇచ్చిన వారికి తగిన బహుమతి అందజేస్తామని ప్రకటించింది.