ములుగు, వెలుగు: అడవుల్లో ప్లాస్టిక్, అటవీ జంతువులకు ఆహారం వేయొద్దని ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ సీహెచ్.సువర్ణ సూచించారు. శనివారం ములుగులో డీఎఫ్వో రాహుల్ కిషన్ జాదవ్తో కలిసి పలు సూచనలతో కూడిన స్టిక్కర్లు, పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మేడారం జాతర సందర్భంగా మొక్కులు చెల్లించుకోవడానికి వచ్చే భక్తులు వన్యప్రాణులకు ఎలాంటి హాని కలిగించొద్దన్నారు.
భక్తులకు అవగాహన కల్పించేవిధంగా ములుగు, పస్రా, తాడ్వాయి రేంజ్ పరిధిలో జాతీయ రహదారికి ఇరువైపులో సైన్ బోర్డులను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో భూపాలపల్లి సీసీఎఫ్ బి.ప్రభాకర్, ఎఫ్డీవో కె.సత్తయ్య, రేంజర్ డోలి శంకర్ తదితరులు పాల్గొన్నారు.
