లండన్: యాషెస్ సిరీస్లో ఘోర పరాజయం తర్వాత ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) సంచలన నిర్ణయాలు తీసుకుంది. జట్టు ఎంపికలో సరికొత్త ప్రయోగానికి తెరతీస్తూ తొలిసారి ఓ విదేశీయుడిని జాతీయ సెలెక్టర్గా నియమించింది.
ఆస్ట్రేలియా మాజీ ప్లేయర్ మార్కస్ నార్త్కు ఈ కీలక బాధ్యతలు అప్పగించింది. ఆరు కౌంటీ జట్లకు ఆడిన అనుభవం నార్త్కు ఉంది. అలాగే 2018 నుంచి డర్హమ్ క్రికెట్ డైరెక్టర్గా పని చేస్తున్నాడు. ఇంగ్లండ్ టెస్ట్ కెప్టెన్ బెన్ స్టోక్స్తోనూ కలిసి పని చేసిన అనుభవం ఉంది.
ఈ నేపథ్యంలో న్యూజిలాండ్తో మూడు టెస్ట్ల సిరీస్లో భాగంగా తొలి మ్యాచ్కు ఇంగ్లండ్ జట్టును ప్రకటించారు. ఫామ్లేమి కారణంగా ఓపెనర్ జాక్ క్రాలీ, ఓలీ పోప్ను టీమ్ నుంచి తప్పించారు. ఇటలీ తరఫున పరిమిత ఓవర్ల క్రికెట్ ఆడిన ఎమిలియో గే, వికెట్ కీపర్ బ్యాటర్ జేమ్స్ రూతో పాటు యంగ్ బౌలర్ సన్నీ బేకర్ను తొలిసారి జట్టులోకి తీసుకున్నారు.
అండర్సన్, బ్రాడ్, వోక్స్ రిటైర్మెంట్ తర్వాత ఇంగ్లండ్ బౌలింగ్ చాలా బలహీనంగా మారింది. మార్క్ వుడ్, బ్రైడన్ కార్సీ గాయపడటం కూడా ఆందోళన కలిగిస్తోంది. దీంతో మాథ్యూ ఫిషర్, గస్ అట్కిన్సన్, ఓలీ రాబిన్సన్, జోష్ టంగ్పై అధిక భారం పడనుంది.
ఇంగ్లండ్ జట్టు
బెన్ స్టోక్స్ (కెప్టెన్), రెహాన్ అహ్మద్, గస్ అట్కిన్సన్, సన్నీ బేకర్, షోయబ్ బషీర్, జాకబ్ బెథెల్, హ్యారీ బ్రూక్, బెన్ డకెట్, మాథ్యూ ఫిషర్, ఎమిలియో గే, జేమ్స్ రూ, ఓలీ రాబిన్సన్, జో రూట్, జేమీ స్మిత్, జోష్ టంగ్.
