న్యూఢిల్లీ: గతేడాది బోర్డర్–గావస్కర్ ట్రోఫీ సందర్భంగా జరిగిన ఓ సంఘటనలో టీమిం డియా పేసర్ మహ్మద్ సిరాజ్ కన్నీటి పర్యంతమయ్యాడని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ టిమ్ పైన్ అన్నాడు. తండ్రి చనిపోయిన బాధలో ఉన్న సిరాజ్పై సిడ్నీ టెస్టులో తమ అభిమానులు జాత్యహంకార వ్యాఖ్యలు చేయాల్సింది కాదన్నాడు. ‘సాధారణంగా ఆసీస్కు వచ్చే విదేశీ జట్లకు మేం చాలా బాగా ఆతిథ్యం ఇస్తాం. కానీ సిరాజ్పై మా ఫ్యాన్స్ జాత్యహంకార వ్యాఖ్యలు చేశారు. ఆ మాటలు విన్న సిరాజ్ అంపైర్ల దగ్గరకు వచ్చి ఫిర్యాదు చేశాడు. అప్పటికే అతని కళ్లలో నీళ్లు తిరుగుతున్నాయి. ఆ మాటలు చాలా బాధించాయనుకుంటా. మాకే ఇబ్బందిగా అనిపించింది. ఒకవేళ ఇండియా సిరీస్ను రద్దు చేసుకుందామని ప్రతిపాదిస్తే ఒప్పుకునే వాళ్లం. కానీ అలా జరగకుండా ఈ వ్యవహారాన్ని ఇండియా బాగా హ్యాండిల్ చేసింది’ అని పైన్ పేర్కొన్నాడు.