ఏపీ బీజేపీ మాజీ అధ్యక్షుడు చిలకం రామచంద్రారెడ్డి(85) ఇకలేరు

ఏపీ బీజేపీ మాజీ అధ్యక్షుడు చిలకం రామచంద్రారెడ్డి(85) ఇకలేరు
  • చెన్నైలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచిన చిలకం రామచంద్రారెడ్డి (85)
  • సాగు,తాగునీటి కోసం పాదయాత్ర
  • ఫ్యాక్షన్ లీడర్ల తుపాకుల లైసన్సులు రద్దు చేయాలని ఉద్యమించిన నేత చిలకం

విజయవాడ: భారతీయ జనతా పార్టీ ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మాజీ అధ్యక్షులు శ్రీ చిలకం రామచంద్ర రెడ్డి (85) చెన్నై ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. అనారోగ్యానికి గురై కొన్ని రోజులుగా చికిత్స పొందుతున్న ఆయన శనివారం రాత్రి తుదిశ్వాస విడిచారు. 
తరచూ కరవు కాటకాలకు.. వర్షాలు బాగా కురిస్తే అతివృష్టి..  లేదంటే కరవు కాటకాలతో సతమతం అవుతూ ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ కంటే పూర్తిగా వెనుకబడి ఉన్న రాయలసీమ సాగునీరు, తాగునీటి కోసం పెద్ద ఎత్తున పాదయాత్ర చేశారు. కరవు ప్రాంతాల్లో బీజేపీ పార్టీ జెండాతో ఉద్యమించి బక్కచిక్కిన కరవు రైతుల జీవితాల్లో ఆశలు రేపారు. సీమ ప్రాజెక్టుల అత్యవసర పరిస్థితిని ఎత్తి చూపారు. పాలకులు గుర్తించేలా తనవంతు కృషి చేశారు. 
అంతేకాదు ముఠా కక్షలకు నిలయమైన రాయలసీమలో కక్షలు, కార్పణ్యాలు లేకుండా శాంతి కుసుమాలు వెలసిల్లేలా చేసేందుకు మరో కీలకమైన ఉద్యమం నిర్వహించారు. ఫ్యాక్షన్ కు మూలమైన తుపాకుల లైసెన్సులను రద్దు చేస్తే తప్ప నాయకుల ఆగడాలు, అరాచకాలు ఆగవని గుర్తించి ఉద్యమాన్ని కొనసాగించారు. తన సొంత సామాజికవర్గం వారి నుండే తీవ్ర వ్యతిరేకత ఎదురైనా  పట్టించుకోకుండా ఫ్యాక్షన్ బాధితుల్లో ఆశలు చిగురింపచేశారు. సాగునీటి ఉద్యమంతో  రాయలసీమ ముఖద్వారంలోని రైతులకే కాదు.. ఫ్యాక్షన్ అంతానికి చేసిన పోరాటంతో సామాన్యులందరి నుంచి జేజేలు అందుకున్నారు. 
ఏపీ నేతల సంతాపం

చిలకం రామచంద్రారెడ్డి మృతి పట్ల ఏపీ బీజేపీ నాయకులు దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోమువీర్రాజు, ఏపీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి సునీల్ దియోధర్, ఎంపీ జీవిల్ నరసింహారావు, జాతీయ ప్రధాన కార్యదర్శి పురందరేశ్వరి, జాతీయ కార్యదర్శి  సత్యకుమార్,ఎమ్మెల్సీ పివిఎన్ మాధవ్,వి.సూర్యనారాయణ రాజు,లోకుల గాంధీ,రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్, సుజనాచౌదరి, సీఎం రమేష్, మాజీ మంత్రులు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి తదితరులు చిలకం సేవలను గుర్తు చేసుకున్నారు. బీజేపీ ఉనికే లేని రోజుల్లో పార్టీ భవిష్యత్తును ఊహించి పోరాటం ద్వారా కార్యకర్తల్లో కొత్త ఊపిరి ఊదే ప్రయత్నం చేశారని వారు కొనియాడారు. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరికీ ఏ కష్టమొచ్చినా అండగా నిలిచేవారని.. వారి మరణం భారతీయ జనతా పార్టీకి అదేవిధంగా వ్యక్తిగతంగా తీరని లోటని సంతాపం వ్యక్తం చేశారు.

దిగ్భ్రాంతిని వ్యక్తం చేసిన తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్
భారతీయ జనతాపార్టీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ అధ్యక్షులు  చిలకం రామచంద్రారెడ్డి ఆకస్మిక మరణం పట్ల బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ పార్లమెంటు సభ్యుడు బండి సంజయ్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. 1981లో సమితి ప్రెసిడెంటుగా బిజెపి అభ్యర్థిగా పోటీ చేసి ఎన్నికై ప్రజా జీవితంలో తనదైన ముద్ర వేసుకున్నారని గుర్తు చేసుకున్నారు. సౌమ్యుడిగా, మంచితనానికి మారుపేరుగా నిలిచిన వ్యక్తి అని కొనియాడారు. ఆనాడు ఉమ్మడి రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా పార్టీకి చేసిన సేవలు ఎనలేనివని, పార్టీలో అనేక పదవులు చేపట్టినా వాటికి వన్నె తెచ్చిన వ్యక్తి అని పేర్కొన్నారు. నీతి నిజాయితీతో పని చేసే విధంగా కార్యకర్తలను తయారు చేశారని, నిరాడంబరంగా జీవిస్తూ పార్టీ కార్యాలయాన్నే తన నివాసంగా చేసుకుని నిరంతరం కార్యకర్తలకు అందుబాటులో నిలిచిన వ్యక్తి అని కొనియాడారు. రైతాంగ సమస్యల పరిష్కారం కోసం రాయలసీమలో రైతులతో కలిసి పాదయాత్ర చేసిన చిలకం రామచంద్రారెడ్డి మరణం బీజేపీకి తీరనిలోటు అన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు, సన్నిహితులకు ప్రగాఢ సంతాపం, సానుభూతి తెలియజేస్తూ వారి ఆత్మకు శాంతి చేకూర్చాలని భగవంతుని ప్రార్థిస్తున్నానని తెలిపారు బండి సంజయ్ కుమార్.