- మూడేండ్లలో 37 వేల మందికే అందిన స్కీమ్
- లక్షా 30 వేల మందికి ప్రొసీడింగ్స్ ఇచ్చామన్న మాజీ సీఎం
- లబ్ధిదారులతో ధర్నా చేస్తామని ప్రభుత్వానికి కేసీఆర్ హెచ్చరిక
- పేర్లు తప్ప ప్రొసీడింగ్స్ ఇయ్యలేదని తెలియడంతో నాలుక కరుచుకుంటున్న బీఆర్ఎస్ అధినేత
హైదరాబాద్, వెలుగు : దళితబంధుపై మాజీ సీఎం కేసీఆర్ చేసిన కామెంట్స్ బూమరాంగ్ అవుతున్నాయి. దళితబంధు స్కీం రెండేండ్లు అసలు అమలు కాలేదని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు చెప్పడంతో గులాబీ బాస్ గందరగోళంలో పడినట్టు తెలిసింది. దళితబంధు కోసం మనం ఒక్క రూపాయి కూడా రిలీజ్ చేయలేదని.. ఇంకా కలెక్టర్ల అకౌంట్లలోకి ఎలా జమ అవుతాయని వారు చెప్పగానే.. ఈ స్కీంపై కేసీఆర్ యూ టర్న్ తీసుకున్నట్టు చర్చ జరుగుతున్నది.
పార్లమెంట్ ఎన్నికల క్యాంపెయినింగ్లో భాగంగా ఇటీవల కేసీఆర్ దళితబంధుపై ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించే విధంగా వ్యాఖ్యలు చేశారు. ‘‘కాంగ్రెస్ ప్రభుత్వం దళితబంధు ఎందుకు అమలు చేయడం లేదో చెప్పాలి. మేం ప్రొసీడింగ్స్ ఇచ్చిన 1.30 లక్షల మంది దళితులను తీసుకొచ్చి స్వయంగా సెక్రటేరియట్వద్ద ఉన్న అంబేద్కర్విగ్రహం దగ్గర దీక్షపట్టి, ప్రభుత్వం మెడలు వంచి అవన్నీ వారికి ఇప్పిస్తాం” అని గతవారం చేవేళ్ల మీటింగ్లో కేసీఆర్మాట్లాడారు.
ఆ మీటింగ్ అనంతరం ప్రస్తుత బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలను పిలిచి దళితబంధు ప్రొసీడింగ్స్ కాపీలు అందిన వారి లిస్ట్ తీసుకుని.. వాళ్లను అంబేద్కర్ విగ్రహం దగ్గర దీక్షకు తీసుకువచ్చేందుకు ప్లాన్ చేయాలని సూచించారు. ముందు గజ్వేల్, సిద్దిపేట, సిరిసిల్ల నియోజకవర్గాల నుంచి దళితబంధు ప్రొసీడింగ్స్ ఎవరికి అందాయా? అని వివరాలు సేకరించే పనిలో పడిన బీఆర్ఎస్ కు ఆ పార్టీ శ్రేణుల నుంచే ఆదిలోనే షాక్ తగిలింది. దళితబంధు ఇస్తామని పేర్లు రాసుకున్నారే తప్ప.. ఎక్కడా ప్రొసీడింగ్స్ ఇవ్వలేదని ఎమ్మెల్యేలు కేటీఆర్, హరీశ్రావుతోనే పార్టీ కార్యకర్తలు చెప్పడంతో ''కరెక్టే మనం ఇవ్వలే కదా’’ అని కంగుతిన్నట్టు తెలిసింది.
2021తోనే దళితబంధు క్లోజ్
హుజూరాబాద్ బై ఎలక్షన్ టైంలో (2021లో) ఆ నియోజకవర్గం మొత్తానికి పైలెట్ ప్రాజెక్ట్గా దళిత బంధు స్కీమ్ను అమలు చేశారు. అనంతరం పైలెట్ ప్రాజెక్టు కిందనే మిగతా సెగ్మెంట్లలో ఒక్కో చోట వంద మందికి, మరో నాలుగు మండలాల్లో పూర్తిస్థాయిలో అమలు చేశారు. ఆ తర్వాత 2023లో దాదాపు 460 మందికి దళితబంధు ఇచ్చి అప్పటి ప్రభుత్వం చేతులు దులుపుకొన్నది.
ఇలా మొత్తంగా చూసినా దళితబంధు లబ్ధిదారుల సంఖ్య మూడేండ్లలో 37 వేలు దాటలేదు. వాస్తవానికి మూడేండ్లలో ఈ స్కీం మూడున్నర లక్షల మందికి పైగా అందాల్సి ఉన్నది. 2022-23, 2023-24 రెండు ఆర్థిక సంవత్సరాల్లో రూ.17,700 కోట్ల చొప్పున బడ్జెట్లో నిధులు కేటాయించినప్పటికీ.. ఒక్కరికి కూడా దళితబంధు అమలు చేయలేదు. నిరుడు ఎన్నికల సంవత్సరం కావడంతో దళితబంధు స్కీంను హడావుడిగా మళ్లీ మొదలుపెట్టే ప్రయత్నం చేసినప్పటికీ.. అదీ సాధ్యపడలేదు. పైగా గత బీఆర్ఎస్ ప్రభుత్వంలోని కొందరు ఎమ్మెల్యేలు దళితబంధు ఇప్పిస్తామని చెప్పి ముందే కమీషన్లు వసూలు చేసుకున్నారు. ఒక్కొక్కరి దగ్గర నుంచి రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షల దాకా తీసుకున్నారు. ఈ విషయాన్ని అప్పుడు సీఎంగా ఉన్న కేసీఆర్కూడా ప్రస్తావించారు.
అసెంబ్లీ ఎన్నికల్లో వ్యతిరేకత.. ఇప్పుడు మళ్లీ అదే టాపిక్
దళితబంధు స్కీంను గత బీఆర్ఎస్ ప్రభు త్వం ఎమ్మెల్యేలకు లింక్ చేసింది. ఎమ్మెల్యేలు ఎవరి పేరు రాసి ఇస్తే వారికే ఇవ్వాలని ఆదేశాలిచ్చింది. ఈ స్కీం కోసం రెండుసార్లు ఎమ్మెల్యేలు పేర్లు రాసుకున్నారు కానీ.. ఒక్కరికీ పథకం వర్తింపజేయలేదు. ఎమ్మెల్యే తమ పేరు రాసుకోలేదని.. పేరు రాసుకున్నా స్కీమ్ ఇవ్వలేదని మరికొందరు దళితులు బీఆర్ఎస్కు వ్యతిరే కంగా ఓటు వేశారని ఆ పార్టీ అంతర్గత విశ్లేష ణల్లోనే వెల్లడైంది.
ఇప్పుడు అదే స్కీమ్పై కేసీఆర్ కామెంట్స్ చేస్తుండటంతో మళ్లీ మొదటికే మోసం వచ్చే ప్రమాదముందని పార్టీ లీడర్లు ఆందోళన చెందుతున్నారు. కేసీఆర్ దళితబంధు స్కీమ్పై కామెంట్లు మానుకుంటే మంచిదని పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.