విమాన ప్రమాదంలో మాజీ CM విజయ్ రూపానీ మృతి.. ఆయన పొలిటికల్ హిస్టరీ ఇదే

విమాన ప్రమాదంలో మాజీ CM విజయ్ రూపానీ మృతి.. ఆయన పొలిటికల్ హిస్టరీ ఇదే

గాంధీ నగర్: అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో బీజేపీ సీనియర్ నేత, గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ మృతి చెందారు. ఈ మేరకు రూపానీ కుటుంబ సభ్యులకు అధికారులకు సమాచారం అందించారు. కాగా, గుజరాత్‏లో ఘోర విమాన ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. అహ్మదాబాద్‎లోని సర్ధార్ వల్లభభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయ సమీపంలోని మేఘాని ప్రాంతంలో చెట్టును ఢీకొని ఎయిర్ ఇండియా విమానం కుప్పకూలింది.

 230 మంది ప్రయాణికులు, ఇద్దరు పైలెట్లు, 10 సిబ్బంది మొత్తం 242 మందితో గురువారం (జూన్ 12) మధ్యాహ్నం ఎయిర్ ఇండియా బోయింగ్ విమానం అహ్మదాబాద్ నుంచి లండన్ బయలుదేరింది. ఎయిర్ పోర్టు నుంచి టేకాఫ్ అయిన ఐదు నిమిషాల్లోనే విమానాశ్రయం సమీపంలోని చెట్టును ఢీకొని జనవాసాల్లో కుప్పకూలింది. ఈ ప్రమాదంలో విమానంలో మొత్తం అంటే 242 మంది చనిపోయారు. పైలెట్లు, విమాన సిబ్బంది, ప్రయాణికులు అంతా సజీవ దహనమయ్యారు. 

Also Read : విమానంలోని 242 మందీ చనిపోయారు

ప్రమాదానికి గురైన ఈ విమానంలోనే గుజరాత్ మాజీ సీఎం విజయ్ రుపానీ కూడా ప్రయాణిస్తున్నారు. ప్రయాణికుల అధికారిక మ్యానిఫెస్ట్‎లో ఆయన పేరు 12వ ఎంట్రీగా ఉంది. బిజినెస్ కేటగిరీలోని జడ్ క్లాస్ కింద ఆయన పేరు లిస్ట్ అయ్యి ఉంది. విజయ్ రూపానీ లండన్ నుంచి తిరిగి రావటానికి కూడా ముందే టికెట్స్ బుక్ చేసుకున్నారు. 2025, జూన్ 30న ఆయన తిరిగి ఇండియాకు రావాల్సి ఉంది. కానీ ఇంతలోనే అనుకోని విధంగా విమాన ప్రమాదంలో మరణించారు.

విజయ్ రూపానీ నేపథ్యం:

1956 ఆగస్టు 2న మయబెన్, రామ్నిక్ లాల్ రూపానీ దంపతులకు ఎడవ సంతానంగా జన్మించాడు విజయ్ రూపానీ. వీరు మయన్మార్లోని యాంగోన్లో బనియా కుటుంబానికి చెందిన వారు. బర్మాలో రాజకీయ అస్థిరత కారణంగా రూపానీ కుటుంబం 1960 లో రాజ్‌కోట్‌కు వలస వచ్చింది. విజయ్ రూపానీ ధర్మేంద్రసింగ్ జీ ఆర్ట్స్ కాలేజీ నుండి బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్, సౌరాష్ట్ర విశ్వవిద్యాలయం నుండి ఎల్.ఎల్.బి కంప్లీట్ చేశాడు. బీజేపీ మాతృ సంస్థ ఆర్ఎస్ఎస్, బీజేపీ అనుబంధ సంస్థ ఏబీపీవీలో విజయ్ రూపానీ కార్యకర్తగా పని చేశారు. 

అనంతరం ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. 1987లో రాజ్‌కోట్ మున్సిపల్ కార్పొరేషన్ (RMC) కార్పొరేటర్‌గా ఎన్నికయ్యారు. 1996 నుంచి 1997 వరకు రాజ్‌కోట్ మేయర్‌గా పనిచేశారు. 1998లో గుజరాత్ యూనిట్ బీజేపీ జనరల్ సెక్రటరీగా పని చేశారు. కేశుభాయ్ పటేల్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మ్యానిఫెస్టో కమిటీ ఛైర్మన్‌గా, 2013లో భారతదేశ ప్రస్తుత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గుజరాత్ మున్సిపల్ ఫైనాన్స్ బోర్డు ఛైర్మన్‌గా విజయ్ రూపానీ పని చేశారు. జూలై 2006 నుంచి జూలై 2012 వరకు విజయ్ రూపానీ రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు.

 ఆనందిబెన్ పటేల్ కేబినెట్‎లో నవంబర్ 2014 నుంచి ఆగస్టు 2016 వరకు రవాణా, కార్మిక & ఉపాధి, నీటి సరఫరా మంత్రిగా కూడా రూపానీ పనిచేశారు.  అనంతరం 2016, ఆగస్టు 7 నుంచి.. 2021, సెప్టెంబర్ 11వరకు వరకు రెండు పర్యాయాలు గుజరాత్ 16వ ముఖ్యమంత్రిగా విజయ్ రూపానీ పనిచేశారు. ఆయన రాజ్‌కోట్ వెస్ట్‌ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించారు. గుజరాత్ బీజేపీలో చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో 2021, సెప్టెంబర్‎లో విజయ్ రూపానీ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు.