
ముంబై: డొమెస్టిక్ క్రికెట్ లెజెండ్, ఢిల్లీ మాజీ కెప్టెన్ మిథున్ మన్హాస్ ప్రపంచంలోనే సంపన్న క్రికెట్ బోర్డు బీసీసీఐ బాస్ అయ్యాడు. ఆదివారం జరిగిన వార్షిక సర్వసభ్య సమావేశం (ఏజీఎం)లో బోర్డు ప్రెసిడెంట్గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు. 45 ఏండ్ల మన్షాస్.. మాజీ క్రికెటర్ రోజర్ బిన్నీ స్థానంలో బీసీసీఐ 37వ ప్రెసిడెంట్గా బాధ్యతలు చేపడుతున్నాడు. గత నెలలో రోజర్ బిన్నీ రాజీనామా చేయడంతో ఈ పదవి ఖాళీ అయింది. గంగూలీ, బిన్నీ తర్వాత బీసీసీఐ ప్రెసిడింగ్ ఎన్నికలైన మూడో ఫస్ట్-క్లాస్ క్రికెటర్ మన్హాస్ కావడం విశేషం. మన్హాస్ 157 ఫస్ట్-క్లాస్ మ్యాచ్ల్లో 9,714 రన్స్ చేశాడు. జమ్మూ కాశ్మీర్ క్రికెట్ అసోసియేషన్ (జేకేసీఏ) వ్యవహారాలను పర్యవేక్షించేందుకు బీసీసీఐ ఏర్పాటు చేసిన అడ్-హాక్ కమిటీకి డైరెక్టర్గా కూడా పనిచేశాడు. ప్రపంచంలోనే అత్యుత్తమ క్రికెట్ బోర్డుకు ప్రెసిడెంట్ అవడం గౌరవంగా భావిస్తున్నానని మిథున్ చెప్పాడు.
‘ఇది పెద్ద బాధ్యత. నా పూర్తి అంకితభావం, పట్టుదలతో ఈ పనిని ఉత్తమంగా చేస్తానని హామీ ఇస్తున్నా. ఒక క్రికెటర్గా, అడ్మినిస్ట్రేటర్గా నా అనుభవం సహాయ పడుతుంది’ అని తెలిపాడు. కాగా, ఏజీఎంలో పలువురు కీలక అధికారుల నియామకాలను కూడా బోర్డు ఖరారు చేసింది. దేవజిత్ సైకియా బోర్డు సెక్రటరీగా, అరుణ్ ధుమాల్ ఐపీఎల్ చైర్మన్గా తమ పదవులను నిలబెట్టుకున్నారు. రాజీవ్ శుక్లా వైస్ ప్రెసిడెంట్గా కొనసాగనుండగా.. కర్నాటక మాజీ క్రికెటర్ రఘురామ్ భట్ కొత్త ట్రెజరర్ బాధ్యతలు స్వీకరించాడు. ఇప్పటిదాకా ట్రెజరర్గా ఉన్న ప్రభతేజ్ భాటియా జాయింట్ సెక్రటరీగా అపాయింట్ అయ్యాడు. సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ జయదేవ్ షా అపెక్స్ కౌన్సిల్ మెంబర్గా అపాయింట్ అయ్యాడు.
సెలెక్షన్ కమిటీలో మార్పులు
నేషనల్ సెలెక్షన్ కమిటీల్లోనూ బోర్డు మార్పులు చేసింది. టీమిండియా మాజీ స్పిన్నర్, హైదరాబాదీ ప్రజ్ఞాన్ ఓఝాతో పాటు మాజీ పేసర్ ఆర్పీ సింగ్ సీనియర్ మెన్స్ సెలెక్టర్లుగా అపాయింట్ అయ్యారు. ఇప్పటి వరకు సీనియర్ సెలెక్షన్ కమిటీలో మెంబర్గా ఉన్న ఎస్. శరత్ జూనియర్ మెన్స్ సెలెక్షన్ కమిటీకి చైర్మన్ అయ్యాడు. నీతూ డేవిడ్ స్థానంలో మాజీ క్రికెటర్ అమిత శర్మ విమెన్స్ సెలెక్షన్ కమిటీ చైర్ పర్సన్గా బాధ్యతలు స్వీకరించింది. హైదరాబాద్ మాజీ క్రికెటర్ స్రవంతి నాయుడు, శ్యామా డే, జయ శర్మ కొత్త సెలెక్టర్లుగా చేరారు.