పాకిస్తాన్ మ్యాచ్కు భారత తుది జట్టు అంచనా

పాకిస్తాన్ మ్యాచ్కు భారత తుది జట్టు అంచనా

భారత్ పాక్ హై ఓల్టేజ్ మ్యాచ్కు మరి కొద్ది గంటల్లో తెరలేవనుంది. ఆదివారం రాత్రి 7 గంటల 30 నిమిషాలకు చిరకాల ప్రత్యర్థులు పోట్లాడుకోబోతున్నారు. టీ20 వరల్డ్ కప్ 2021లో ఎదురైన పరాభవానికి ప్రతీకారం తీర్చుకోవాలని  రోహిత్ సేన  భావిస్తుండగా.. టీ20 వరల్డ్ కప్ జోరును ఆసియాకప్ లోనూ కొనసాగించాలని పాక్ ప్లాన్స్ వేస్తోంది. ఈ నేపథ్యంలో  భారత్ పాక్ మ్యాచ్ పై  ఆసక్తి నెలకొంది. అయితే ఈ మ్యాచ్ లో బరిలోకి దిగే భారత జట్టును మాజీ క్రికెటర్ వసీం జాఫర్ అంచనా వేశాడు. 

ఓపెనర్లుగా వారిద్దరే..
టీమిండియా మాజీ క్రికెటర్ వసీం జాఫర్ ట్విటర్ వేదికగా పాక్తో ఆడబోయే భారత జట్టును అంచనా వేశాడు. ఓపెనర్లుగా కేఎల్ రాహుల్, రోహిత్ శర్మలు బరిలోకి దిగే ఛాన్సుందన్నాడు. వన్ డౌన్ లో కోహ్లీ, నాలుగో స్థానంలో సూర్యకుమార్ యాదవ్ ఆడతారని జోస్యం చెప్పాడు. ఐదో స్థానంలో ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా బరిలోకి దిగితే బావుంటుందన్నాడు. అయితే ఆరో స్థానంలో మాత్రం పంత్, దినేశ్ కార్తీక్‌లలో ఒకరికి మాత్రమే చోటివ్వాలని చెప్పాడు.  ఏడో స్థానంలో ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా ఆడుతాడని చెప్పాడు. 8వ స్థానంలో భువనేశ్వర్ కుమార్ కు స్థానం ఉంటుందని అంచనా వేశాడు. 

కార్తీక్ లేదా పంత్..
చాహల్ మొదటి స్పిన్నర్గా బరిలోకి దిగుతాడని భావించిన వసీం జాఫర్.. రెండో స్పిన్నర్‌గా మాత్రం అశ్విన్‌కు బదులు రవిబిష్ణోయ్‌కు చోటిచ్చాడు. అటు దినేశ్ కార్తీక్, రిషభ్ పంత్‌లలో ఒకర్ని మాత్రమే తీసుకుంటే మంచిదని సలహా ఇస్తున్నాడు. అయితే కెప్టెన్ రోహిత్..పంత్ కు బదులు కార్తీక్ ను ఎంపిక చేసుకునే అవకాశం ఉందన్నాడు. 

అర్షదీప్కు ఛాన్స్..?
పాక్తో జరిగే మ్యా్చ్లో భువీకి తోడుగా అర్ష్ దీప్ సింగ్ ఆడే ఛాన్సుందని వసీం జాఫర్ ఎక్స్పెక్ట్ చేశాడు. వీరిద్దరితో పాటు మూడో పేసర్‌గా హార్దిక్ పాండ్యా బాధ్యతలు నిర్వర్తిస్తాడని చెప్పాడు. స్పెషలిస్ట్ స్పిన్నర్లుగా చాహల్, రవి బిష్ణోయ్‌లకు చోటు దక్కుతుందన్నాడు.  వీరికి అండగా స్పిన్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా ఉంటాడని చెప్పాడు. మొత్తంగా ఇద్దరు ఆల్‌రౌండర్లతో కలిపి ఆరుగురు బౌలింగ్ చేస్తారని అంచనా వేశాడు. అయితే దుబాయ్ పిచ్‌లు నెమ్మదిగా  ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో ముగ్గురు స్పిన్నర్లు, ముగ్గురు పేసర్లు ఉండేలా భారత్ టీమ్‌ను ఎంచుకునే అవకాశం ఉందన్నాడు.

వసీం జాఫర్ భారత్ తుది జట్టు:
రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, దినేశ్ కార్తీక్ లేదా పంత్, రవీంద్ర జడేజా, భువనేశ్వర్ కుమార్, రవి బిష్ణోయ్, యుజ్వేంద్ర చాహల్, అర్షదీప్ సింగ్