ఆస్తులు బయట పెడితే ఎవరు దోపిడీ చేశారో తెలుస్తుంది : ధర్మపురి సంజయ్

ఆస్తులు బయట పెడితే  ఎవరు దోపిడీ చేశారో తెలుస్తుంది : ధర్మపురి సంజయ్

నిజామాబాద్​, వెలుగు: మాజీ మేయర్​ ధర్మపురి సంజయ్​ మొదటిసారి తన సోదరుడు ఎంపీ అర్వింద్​ కు సవాల్​ విసిరాడు.  ఎంపీగా అర్వింద్​ చేసిందేమీలేనందునే అవతలివారిపై పడ్తున్నడని విమర్శించారు.  ఆదివారం  స్వగృహంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సంజయ్​ తన తమ్ముడు ఎంపీ అర్వింద్​పై ఘాటు విమర్శలు చేశారు. ‘‘డి.శ్రీనివాస్​కు ఇద్దరు కొడుకులున్నరు. ఇద్దరి ఆస్తులు బయటపెడ్దాం. అప్పుడు ఎవరు దోచుకున్నరో ఓపెన్​ అవుతది’  అని సవాల్​ విసిరారు.  బీజేపీ గెలిస్తే నిజామాబాద్​ కార్పొరేషన్​ పేరును ఇందూర్​గా మారుస్తామంటూ చేపట్టిన  ప్రచారాన్ని ఎద్దేవా చేశారు.  నిజామాబాద్​ మున్సిపాలిటీలో ఇద్దరు బీజేపీ చైర్​పర్సన్లు  పనిచేశారని అప్పుడెందుకు ఇందూర్​ పేరు యాదికి రాలేదని  ప్రశ్నించారు.

పేర్లు మార్చడానికి ఎంపీ, ఎమ్మెల్యేలెందుకు పెయింటర్​ చాలుకదా అని అన్నారు.   నాగారం ఏరియాలో దొంగపట్టాలతో పేదలకిచ్చిన ఇండ్ల స్థలాలు ఆక్రమించిన వారి సంగతి తేలుస్తానన్న ఎంపీ అర్వింద్​ హామీ యాడబోయిందని ప్రశ్నించారు.  రాష్ట్రంలో సంక్షేమ  పథకాలతో ముందుకెళ్తున్న కాంగ్రెస్​కు అండగా ఉండాలని కోరారు. అధిక స్థానాల్లో గెలిచేలా సపోర్టు చేసి నగరపాలక సంస్థలో కాంగ్రెస్​ పార్టీ జెండా ఎగరేయాలన్నారు.  బీజేపీ కార్పొరేటర్లు  గెలిస్తే గల్లీ పనుల కోసం ఢిల్లీ చక్కర్లు కొట్టే పరిస్థితులు వస్తాయన్నారు.