- మాజీ మంత్రి జీవన్ రెడ్డి
జగిత్యాల రూరల్, వెలుగు: ఉపాధి హామీ పథకంలో మహాత్మా గాంధీ పేరు మార్చే ఆలోచనను కేంద్రం వెంటనే ఉపసంహరించుకోవాలని మాజీ మంత్రి జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్లో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ గ్రామీణ ప్రజలకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా గాంధీ పేరుతో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయ రంగానికి అనుసంధానం చేసి మరింత బలోపేతం చేయాలని డిమాండ్ చేశారు.
గాంధీజీ పేరు తొలగించి వికసిత భారత్ గ్యారంటీ ఫర్ రోజ్ఘర్ అజీవిక మిషన్ గ్రామీణ (విబిజి రాంజీ)గా పేరు మార్చాలన్న ప్రతిపాదన దారుణమన్నారు. వికసిత భారత్ అనే భావన నిజంగా రామ రాజ్యాన్ని అనుసరిస్తే ‘వికసిత శ్రీరామ్’గా పేరు పెట్టాలని వ్యాఖ్యానించారు. సమావేశంలో డీసీసీ అధ్యక్షుడు గాజంగి నందయ్య, బండ శంకర్, జున్ను రాజేందర్, మోహన్, గాజుల రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.
