
శామీర్పేట: మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డి భూ కబ్జా ఆరోపణల వ్యవహారం మరో మలుపు తిరిగింది. తమ భూములను కాజేసేందుకు మల్లారెడ్డి బెదిరింపులకు పాల్పడుతున్నాడని తమకు రక్షణ కల్పించాలని మేడ్చల్ జిల్లా కలెక్టరేట్వద్ద కేశవరం భూ బాధితులు కోరారు. మేడ్చల్ జిల్లా మూడు చింతలపల్లి మండలం కేశవరం గ్రామ పంచాయతీ పరిధిలోని సర్వే నం.33, 34,35లో గిరిజన భూములను కబ్జా చేశారనే ఆరోపణలున్నాయి.
అయితే, వారసత్వ హక్కుదారులను పక్కన పెట్టి బినామీలతో బేరసారాలు చేసి పక్కా ప్లాన్తో భూమిని కాజేశారంటూ బాధితులు గంగారాం భార్య మోతి, పంట శ్రీనివాస్ రెడ్డి అనే వ్యక్తి మేడ్చల్ కలెక్టరేట్ వద్ద సోమవారం ఆందోళన చేశారు. సోమవారం మేడ్చల్ కలెక్టరేట్లో జరిగిన ప్రజావాణిలో అన్ని ఆధారాలతో ఫిర్యాదు చేశామన్నారు. తమకు న్యాయం చేయాలని కోరారు.
జీడిమెట్ల: నిజాంపేట కార్పొరేషన్ పరిధి
లోని వివిధ సర్వే నంబర్లలో ప్రభుత్వ భూమి, చెరువులు, నాలాలు ఆక్రమించి కట్టిన నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని నిజాంపేటబీజేపీ అధ్యక్షుడు ఆకుల సతీశ్ ఆధ్వర్యంలో సోమవారం ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అక్రమ నిర్మాణాలపై మున్సిపల్, రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులకు ఎన్ని సార్లు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోకపోవట్లేదన్నారు. అధికారులు వెంటనే స్పందించి ఆక్రమణలపై చర్యలు తీసుకోవాలన్నారు.