వేములవాడ మాజీ ఎమ్మెల్యే చెన్నమనేనిపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇవాళ హైకోర్టులో చెన్నమనేని పౌరసత్వంపై విచారణ సందర్బంగా కోర్టును తప్పుదోవ పట్టించారా లేదా అని ప్రశ్నించింది. కోర్టును తప్పుదోవ పట్టించే వాళ్లకు ఎందుకు ఉపశమనం కల్పించాలని ఆగ్రహం వ్యక్తం చేసింది. 2018 ఎన్నికల్లో జర్మనీ పౌరసత్వంతో పోటీ చేశారు.. ఇప్పటికీ జర్మనీ పౌరసత్వంతోనే ప్రయాణాలు చేస్తున్నారా అని ప్రశ్నించింది. 2018 ఎన్నికల సందర్భంగా జర్మనీ పాస్ పోర్ట్ మీద ప్రయాణం చేశారని కోర్టుకు తెలిపారు సీనియర్ కౌన్సిల్ న్యాయవాది రవి కిరణ్ రావు.
2019 లో ఓవర్సీస్ సిటిజెన్ ఆఫ్ ఇండియా కార్డుకు అప్లై చేశారని కోర్టుకు తెలిపారు రవి కిరణ్ రావు. 2019 సెప్టెంబర్ లో ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా కార్డు తీసుకునేటప్పుడే జర్మనీ పౌరసత్వం కల్గి ఉన్నారని న్యాయవాది రవికిరణ్ కోర్టుకు సూచించారు. గత సంవత్సర కాలంలో చెన్నమనేని చేసిన ప్రయాణాల పూర్తి వివరాలు సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను జనవరి 12కు వాయిదా వేసింది హైకోర్టు.