
- ఉదయం 10 గంటలకు హాజరుకానున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్
- కేటీఆర్ను విచారించనున్న ఐదుగురు సభ్యుల బృందం
హైదరాబాద్, వెలుగు: ఫార్ములా-ఈ రేసు కేసులో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి ఏసీబీ ముందుకు రానున్నారు. దర్యాప్తులో భాగంగా ఏసీబీ ఇప్పటికే నోటీసులిచ్చింది. ఈ మేరకు సోమవారం ఉదయం 10 గంటలకు బంజారాహిల్స్లోని ఏసీబీ కేంద్ర కార్యాలయానికి కేటీఆర్ చేరుకుంటారు. ఈ నేపథ్యంలో ఏసీబీ కార్యాలయం వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. ఏసీబీ కార్యాలయం సహా బంజారాహిల్స్ పరిసర ప్రాంతాల్లో పోలీసులను మోహరించనున్నారు. ఈ కేసులో ఏ-1గా ఉన్న కేటీఆర్ను ఇప్పటికే జనవరి 9న ఏసీబీ అధికారులు విచారించారు. మరోసారి విచారణకు గత నెల 28న రావాలంటూ నోటీసులిచ్చినా.. విదేశీ పర్యటన కారణంగా తాను రాలేనని ఏసీబీకి కేటీఆర్ తెలిపారు.
దీంతో మరోసారి ఏసీబీ నోటీసులివ్వడంతో.. సోమవారం విచారణకు తాను వెళ్తానని కేటీఆర్ ఇప్పటికే ఎక్స్ వేదికగా ప్రకటించారు. కాగా, కేటీఆర్ను ప్రశ్నించేందుకు ఏసీబీ అధికారులు పూర్తిస్థాయిలో సన్నద్ధమయ్యారు. ఏసీబీ డీఎస్పీ మాజిద్ అలీ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల బృందం పలు కీలక అంశాలపై వివరాలు రాబట్టేందుకు ఇప్పటికే ప్రశ్నావళి సిద్ధం చేసుకున్నట్టు తెలిసింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిర్వహించిన ఫార్ములా- ఈ కార్ రేస్లో రూ.54.89 కోట్లు దుర్వినియోగం జరిగిందనే ఆరోపణలపై ఏసీబీ కేసు నమోదు చేసింది.
సంఘీభావం ప్రకటించేందుకు రావాలని పిలుపు
కేటీఆర్ సోమవారం ఏసీబీ విచారణకు హాజరవుతున్న నేపథ్యంలో ఆయనకు సంఘీభావంగా పార్టీ శ్రేణులు తెలంగాణ భవన్కు తరలిరావాలని పార్టీ నేతలు పిలుపునిచ్చారు. కేటీఆర్ సోమవారం ఉదయం 9 గంటలకు తెలంగాణ భవన్కు చేరుకొని, అక్కడి నుంచి బంజారాహిల్స్లోని ఏసీబీ కేంద్ర కార్యాలయానికి వెళ్లనున్నారు. ఈ నేపథ్యంలో పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో తెలంగాణ భవన్కు తరలివచ్చి.. కేటీఆర్ వెంట ఏసీబీ కార్యాలయానికి వెళ్లేలా పార్టీ నాయకత్వం ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిసింది.