న్యూఢిల్లీ: ఒకేసారి రెండు జాబ్లు చేయడాన్ని (మూన్లైటింగ్ను) విప్రో సీరియస్గా తీసుకుంది. తమ కంపెనీతోపాటు ఇతర చోట్ల పనిచేయడాన్ని సహించబోమని స్పష్టం చేసింది. ఇలా చేస్తున్న 300 మంది జాబ్స్ను తీసేశామని విప్రో చైర్మన్ రిషబ్ ప్రేమ్జీ ప్రకటించారు. మూన్లైటింగ్ అంటే కంపెనీలను ఉద్యోగులు మోసం చేయడం తప్ప ఏమీ కాదన్న తన కామెంట్స్కు కట్టుబడి ఉన్నానని ఆయన మరోసారి స్పష్టం చేశారు. తమ ఉద్యోగుల్లో కొందరు తమ ప్రత్యర్థి కంపెనీల కోసం పనిచేస్తున్నారు. ఇలాంటి వారి సంఖ్య 300 వరకు ఉన్నట్టు మేం గుర్తించామని ఆలిండియా మేనేజ్మెంట్ అసోసియేషన్ నేషనల్ మేనేజ్మెంట్ కన్వెన్షన్లో మాట్లాడుతూ వెల్లడించారు.
వాళ్లుచేసిన పని కంపెనీ సమగ్రతను దెబ్బతీసింది కాబట్టే ఈ నిర్ణయం తీసుకున్నామని వివరణ ఇచ్చారు. తమ ఉద్యోగులు వేరే చోట్ల పనిచేయడాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోబోమని వివరించారు. విప్రోతోపాటు ఇన్ఫోసిస్ కూడా మూన్లైటింగ్కు వ్యతిరేకమని స్పష్టం చేసింది. ‘‘రెండు జీవితాలు వద్దు! రెండు ఉద్యోగాలు వద్దు! ఎంప్లాయీ హ్యాండ్బుక్, కోడ్ ఆఫ్ కండక్ట్ ప్రకారం..మూన్లైటింగ్ నిషిద్ధం. డ్యూయల్ ఎంప్లాయ్మెంట్కు మేం ఒప్పుకోం. రూల్స్కు వ్యతిరేకంగా వెళ్లిన వారిని తొలగించడానికి కూడా వెనుకాడేది లేదు”అని ఉద్యోగులకు పంపించిన ఇంటర్నల్ కమ్యూనికేషన్లో స్పష్టం చేసింది.
స్విగ్గీలో అఫీషియల్...
ఫుడ్ ఆర్డరింగ్ డెలివరీ ప్లాట్ఫారమ్ స్విగ్గీ మొట్ట మొదటిసారిగా మూన్లైటింగ్ పాలసీని ప్రవేశపెట్టింది. ఇక నుంచి స్విగ్గీ ఉద్యోగులు అదనపు ఆదాయం- కోసం ఇతర ప్రాజెక్ట్లను తీసుకోవచ్చు. ఇందుకు ఇంటర్నల్ అప్రూవల్స్ అవసరం. ఉద్యోగులు కొన్ని షరతులు పాటిస్తేనే రెండవ ఉద్యోగం/పని చేయడానికి అనుమతి ఇస్తారు. ఆఫీస్ సమయం ముగిశాక లేదా వారాంతాల్లో ఇలాంటి పనులు చేసుకోవచ్చు. ప్రొడక్టివిటీ దెబ్బతినని పద్ధతిలో ఇతర వర్క్ చేసుకోవచ్చని కంపెనీ ప్రకటించింది. దేశవ్యాప్త లాక్డౌన్ల సమయంలో చాలా మంది కొత్త అలవాట్లను నేర్చుకున్నారని, రెండో జాబ్ చేయడం మొదలుపెట్టారని సంస్థ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఒకరు అన్నారు.