- గెస్టులుగా అంబేద్కర్, కుమ్రం భీమ్ మనమళ్లు
హైదరాబాద్, వెలుగు : దళిత ఉప కులాల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా అక్టోబర్ 4న ‘అట్టడుగు వర్గాల ఆత్మగౌరవ సభ’ నిర్వహించనున్నట్లు ఎస్సీ ఉపకులాల హక్కుల పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు బైరి వెంకటేశం మోచి తెలిపారు. శనివారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సభకు ముఖ్య అతిథిగా బీఆర్ అంబేద్కర్ మనమడు ప్రకాశ్ అంబేద్కర్, గౌరవ అతిథిగా కుమ్రం భీమ్ మనమడు కుమ్రం సోనేరావు భీమ్ వస్తున్నారని తెలిపారు.
హైదరాబాద్ దోబీఘాట్ గ్రౌండ్లో సభ నిర్వహిస్తున్నట్టు చెప్పారు. ఈ బహిరంగ సభకు రాష్ట్రంలోని అన్ని దళిత ఉపకులాల ప్రజలు హాజరు కావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో ఎస్సీ ఉపకులాల హక్కుల పోరాట సమితి నాయకులు, జాతీయ గిరిజన పరిశోధకులు తదితరులు పాల్గొన్నారు.