ఈతకు వెళ్లి నలుగురు చిన్నారులు మృతి

ఈతకు వెళ్లి నలుగురు చిన్నారులు మృతి

రంగారెడ్డి జిల్లా : రంగారెడ్డి జిల్లా యాచారం మండలంలో విషాదం నెలకొంది. తాటిపర్తి చెరువులో ఈతకు వెళ్లిన నలుగురు చిన్నారులు ప్రమాదవశాత్తు మునిగి చనిపోయారు. ఈ ఘటన తాటిపర్తి శివారు గ్రామం గొల్లగూడలో జరిగింది. మృతుల్లో ముగ్గురు అబ్బాయిలు, ఒక అమ్మాయి ఉన్నారు. గొల్లగూడ సమీపంలోని దర్గాకు వెళ్లి తిరిగి ఇంటికి వెళ్తుండగా.. తాటిపర్తి చెరువులో నలుగురు చిన్నారులు ఈతకు వెళ్లి ప్రమాదవశాత్తు మునిగి చనిపోయారని తెలుస్తోంది. చెరువులో పిల్లలు పడిపోయారని గొల్లగూడ గ్రామానికి చెందిన ఓ వ్యక్తి సమాచారం ఇవ్వడంతో తల్లిదండ్రులు, గ్రామస్తులు ఘటనాస్థలానికి హుటాహుటిన వెళ్లారు. అప్పటికే నలుగురు చిన్నారులు మృతి చెందారు. 

చనిపోయిన వారు..

మృతుల్లో ఎనిమిదో తరగతి చదువుతున్న మొహమ్మద్ ఖాలిద్ (12),  పదోతరగతి చదువుతున్న కుమారీ సమ్రీన్ (14),  ఐదో తరగతి విద్యార్థి మొహమ్మద్ రేహాన్ (10), నాలుగో తరగతి విద్యార్థి షేక్ ఇమ్రాన్ (9) ఉన్నారు. వీరిలో మొహమ్మద్ ఖాలిద్, కుమారీ సమ్రీన్ అక్క, తమ్ముడు. మొహమ్మద్ రేహాన్, షేక్ ఇమ్రాన్ మరో రెండు కుటుంబాలకు చెందినవారని గ్రామస్తులు చెబుతున్నారు. ఈ ప్రమాదంపై యాచారం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

పిల్లల మృతి విషయం తెలియగానే గ్రామస్తులు పెద్ద సంఖ్యలో తాటిపర్తి చెరువు వద్దకు చేరుకున్నారు. విగతజీవులుగా పడి ఉన్న పిల్లల మృతదేహాలను చూసి తల్లిదండ్రులు, బంధువులు గుండెలవిసేలా రోదించడం ప్రతి ఒక్కర్నీ కంటతడి పెట్టించింది. వారి జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటూ రోదిస్తున్నారు.