
- తనిఖీల్లో గుర్తించినట్టు తెలిపిన తెలంగాణ మెడికల్ కౌన్సిల్
సిద్దిపేట టౌన్, వెలుగు: సిద్దిపేటలో ఫేక్ డాక్టర్లను గుర్తించామని తెలంగాణ మెడికల్ కౌన్సిల్ వైస్ చైర్మన్ డాక్టర్ జి. శ్రీనివాస్, సిద్దిపేట ఐఏంఏ అధ్యక్షుడు డాక్టర్ చందర్ తెలిపారు. శుక్రవారం సిద్దిపేటలోని పలు ప్రైవేటు ఆస్పత్రులు, ఫస్ట్ ఎయిడ్ సెంటర్లను కౌన్సిల్ ఆధ్వర్యంలో తనిఖీలు చేశారు. అనంతరం సిద్దిపేట ప్రెస్క్లబ్లో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడారు.
టౌన్ లో 20 ఆస్పత్రుల్లో తనిఖీలు నిర్వహించామని, ప్రసాద్ ఫస్ట్ ఎయిడ్ సెంటర్, భార్గవి ఫస్ట్ ఎయిడ్ సెంటర్, సాత్విక ఫస్ట్ ఎయిడ్ సెంటర్, రాజరాజేశ్వరి ఫస్ట్ ఎయిడ్ సెంటర్లలో అర్హత లేకున్నా చికిత్స చేస్తున్నారన్నారు. గతంలో కాంపౌండర్లుగా పనిచేసి డాక్టర్లుగా చెలామణి అవుతూ యాంటీ బయోటిక్ మందులు, స్టెరాయిడ్స్ ఇస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారన్నారు.
వీరిపై పోలీసులలకు ఫిర్యాదు చేస్తామన్నారు. డీఎంహెచ్ వో నుంచి అనుమతులు తీసుకున్న ఆస్పత్రుల్లో అర్హత కలిగిన డాక్టర్లు మాత్రమే ప్రజలకు వైద్య సేవలు అందించాలని పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఐఏంఏ అధ్యక్షుడు డాక్టర్ చందర్, జనరల్ సెక్రటరీ డాక్టర్ గణేశ్, ట్రెజరర్ డాక్టర్ ప్రణిత్, డాక్టర్ సముద్రాల శ్రీనివాస్, డాక్టర్ సతీష్, డాక్టర్ శ్రవణ్, డాక్టర్ విష్ణు తదితరులు పాల్గొన్నారు.