- హనుమకొండ నగరంలో ఘటన
హనుమకొండ, వెలుగు : వరంగల్ కమిషనరేట్కు కూతవేటు దూరంలో ఉన్న హనుమకొండ పోలీస్స్టేషన్ నుంచి నలుగురు గంజాయి స్మగ్లర్లు పరార్ అయ్యారు. దీంతో నిందితుల కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే... గంజాయి రవాణా చేస్తున్న నలుగురు యువకులను వరంగల్కు చెందిన నార్కోటిక్ బ్యూరో అధికారులు ఆదివారం హనుమకొండ పీఎస్ పరిధిలో పట్టుకున్నారు. అనంతరం వారితో పాటు, స్వాధీనం చేసుకున్న గంజాయిని హనుమకొండ పోలీస్స్టేషన్లో అప్పగించారు.
సోమవారం తెల్లవారుజామున ఐదు గంటల సమయంలో సెంట్రీతో పాటు డ్యూటీలో ఉన్న సిబ్బంది కళ్లుగప్పి నలుగురు యువకులు స్టేషన్ నుంచి పారిపోయినట్లు తెలిసింది. ఉన్నతాధికారుల ఆదేశాలతో నిందితుల కోసం సోమవారం ఉదయం నుంచి పోలీసులు గాలింపు చర్యలు చేపడుతున్నారు. కాగా, హనుమకొండ నగరం నడిమధ్యన ఉన్న స్టేషన్ నుంచి యువకులు తప్పించుకోవడం కలకలం రేపింది.

