బైక్​ ప్రమాదాల్లో నలుగురు మృతి

బైక్​ ప్రమాదాల్లో నలుగురు మృతి

 కొల్చారం/  హసన్ పర్తి , వెలుగు: రెండు చోట్ల శుక్రవారం జరిగిన వేర్వేరు బైక్​ ప్రమాదాల్లో  నలుగురు చనిపోయారు.   మెదక్​ జిల్లాలో బైక్​ అదుపుతప్పి రెయిలింగ్‌ను ఢీకొనగా  ఇద్దరు చనిపోయారు. మెదక్​జిల్లా కొల్చారం మండలకేంద్రానికి చెందిన గ్రామపంచాయతీ మాజీ వార్డ్​మెంబర్​మహమూద్‌(48), బేకరీలో పనిచేసే ఆరీఫ్‌(55) శుక్రవారం బైక్‌పై కౌడిపల్లికి వెళ్లి తిరిగివస్తున్నారు. మెదక్‌,  హైదరాబాద్​హైవేపై లోతువాగు వద్ద  వారి బైక్​ అదుపు తప్పి రోడ్డు పక్కనున్న రెయిలింగ్‌ను ఢీకొట్టింది.   ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఆరీఫ్​ స్పాట్‌లోనే చనిపోయాడు.

మహమూద్‌ను స్థానికులు 108 వాహనంలో హాస్పిటల్‌కు తరలిస్తుండగా  మార్గ మధ్యలో చనిపోయాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు కొల్చారం ఎస్ఐ మహ్మద్​గౌస్ తెలిపారు. హనుమకొండ జిల్లా  బీమారం  కేయూ పోలీస్​ స్టేషన్​ దగ్గర బైక్​ అదుపు తప్పి డివైడర్​ను ఢీకొనగా ఇద్దరు స్టూడెంట్స్​ చనిపోగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు.   గురువారం అర్ధరాత్రి  హనుమకొండలోని  హనుమాన్ నగర్ చెందిన బొజ్జ విశ్వతేజ (22),  జవహర్ కాలనీ చెందిన తిప్పని సూర్య తేజ (22), కొత్తూరు జెండాకు చెందిన బొజ్జ సిరి సాత్విక్ ముగ్గురు స్నేహితులు.

 గురువారం అర్ధరాత్రి  పల్సర్ బైక్ పై వరంగల్ కిట్స్ ఇంజనీరింగ్ కాలేజీకి వెళ్లి తిరిగి  వస్తుండగా భీమారంలోని  విశాల్ మార్ట్ వద్ద బైక్ అదుపు తప్పి వేగంగా డివైడర్లకు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో  బైక్ పై  కూర్చున్న బొజ్జ విశ్వతేజ, తిప్పని సూర్యతేజ హస్పిటల్ కి తరలిస్తుండగామరణించారు. బైక్ నడుపుతున్న సిరిసాత్విక్   తీవ్ర గాయాలతో హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నాడు.   బీటెక్ పూర్తి చేసిన వారు ఉద్యోగాలు చేసి కుటుంబాలకు అండగా ఉండాల్సి సమయంలో  మరణించడం వారి కుటుంబాలను కలిచివేసింది.  బాధిత కుటుంబాల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్టు  కేయూ సీఐ అబ్బయ్య తెలిపారు.