
న్యూఢిల్లీ: ఢిల్లీలోని ఓ బిల్డింగ్లో మంటలు చెలరేగి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతిచెందారు. ద్వారకాలోని ప్రేమ్నగర్ ఏరియాలో మంగళవారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది. హీరా సింగ్ (48) వృత్తిరీత్యా ఫొటోగ్రాఫర్. అతని భార్య నీతు (40), ఇద్దరు కుమారులు రాబిన్(22), లక్షయ్(21)తో పాటు అతని తల్లితో కలిసి రెండస్తుల బిల్డింగ్లో నివాసముంటున్నారు.
మంగళవారం తెల్లవారుజామున 3:30 గంటల సమయంలో ఫస్ట్ఫ్లోర్లో ఇన్వర్టర్ నుంచి మంటలు వ్యాపించి పక్కనే ఉన్న సోఫాకు అంటుకున్నాయి. ఆ తర్వాత ఇల్లంతా పొగ కమ్ముకుంది. దీంతో హీరా సింగ్, అతని భార్య, కుమారులు ఊపిరాడక అపస్మారక స్థితికి వెళ్లారు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది వారిని ఆస్పత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపారు. కాగా, గ్రౌండ్ ఫ్లోర్లో నిద్రిస్తున్న హీరా సింగ్ తల్లి సీతాదేవి ప్రాణాలతో బయటపడింది.