![మన దేశ మూలాలున్న నలుగురికి అమెరికా కాంగ్రెస్లో కీలక పదవులు](https://static.v6velugu.com/uploads/2023/02/US-Congress_Wk6bsiovzM.jpg)
- ప్రమీలా జయపాల్కు ఇమిగ్రేషన్ వ్యవహారాల కమిటీలో చోటు
వాషింగ్టన్: భారత మూలాలున్న నలుగురు అమెరికా కాంగ్రెస్ సభ్యులను కీలక పదవులు వరించాయి. కాంగ్రెస్ లోని మూడు కీలకమైన సభా సంఘాల్లో ప్రమీలా జయపాల్, అమీ బెరా, రాజా కృష్ణమూర్తి, రో ఖన్నాలకు చోటు దక్కింది.
ప్రమీలా జయపాల్
ఇమిగ్రేషన్ వ్యవహారాలకు సంబంధించిన జ్యుడీషియరీ కమిటీలో ర్యాంకింగ్ మెంబర్గా ప్రమీలా జయపాల్ కు అవకాశం లభించింది. విదేశీ మూలాలున్న వ్యక్తికి ఈ కమిటీలో చోటు లభించడం ఇదే తొలిసారి. 57 ఏళ్ల ప్రమీలా జయపాల్ వాషింగ్టన్స్టేట్లోని 7వ డిస్ట్రిక్ట్ నుంచి అమెరికా కాంగ్రెస్లో ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
అమీ బెరా
అమెరికా కాంగ్రెస్లో ఇంటెలిజెన్స్ వ్యవహారాలను పర్యవేక్షించే కమిటీలో 57 ఏళ్ల అమీ బెరాకు చోటు దక్కింది. సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ(సీఐఏ), నేషనల్ ఇంటెలిజెన్స్ కార్యాలయం, నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీ (ఎన్ఎస్ఏ) , మిలిటరీ ఇంటెలిజెన్స్ వ్యవహారాలను ఈ కమిటీ పర్యవేక్షిస్తుంది. కాంగ్రెస్కు చెందిన ఫారిన్ అఫైర్స్ కమిటీ, సైన్స్, స్పేస్ అండ్ టెక్నాలజీ కమిటీలోనూ ఆయన సభ్యులుగా వ్యవహరించనున్నారు. కాలిఫోర్నియా స్టేట్లోని 6వ జిల్లా నుంచి ఇప్పటివరకు ఆరుసార్లు అమీ బెరా కాంగ్రెస్ కు ఎన్నికయ్యారు.
రాజా కృష్ణమూర్తి
చైనా వ్యవహారాలను పర్యవేక్షించేందుకు అమెరికా కాంగ్రెస్ కొత్తగా ఏర్పాటు చేసిన కమిటీలో ర్యాంకింగ్ మెంబర్గా రాజా కృష్ణమూర్తి నియమితులయ్యారు. చైనా నుంచి అమెరికా సహా ప్రపంచ దేశాలకు పొంచి ఉన్న ముప్పుపై ఈ కమిటీ దృష్టిపెడుతుంది. 49 ఏళ్ల రాజా కృష్ణమూర్తి ఇల్లినాయిస్ స్టేట్ లోని 8వ డిస్ట్రిక్ట్ నుంచి కాంగ్రెస్కు నాలుగు సార్లు ఎన్నికయ్యారు.
రో ఖన్నా
చైనా వ్యవహారాలపై కొత్తగా ఏర్పాటు చేసిన కమిటీలోనే 46 ఏండ్ల రో ఖన్నాకు సైతం చోటు దక్కింది. ఈయన కాలిఫోర్నియా స్టేట్లో ని 17వ జిల్లా నుంచి కాంగ్రెస్కు ఇప్పటివరకు 4 సార్లు ఎన్నికయ్యారు.