
ఇస్లామాబాద్: పహల్గాం దాడి తర్వాత లష్కరే తయిబా చీఫ్ హఫీజ్ సయీద్కు పాకిస్తాన్ సర్కారు భద్రతను పెంచింది. గతంతో పోలిస్తే అతడి సెక్యూరిటీని నాలుగు అంచెలకు పెంచేసింది. అతడి ఇంటి చుట్టూ పెద్ద సంఖ్యలో భద్రతా బలగాలను మోహరించింది. ఈ మేరకు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. లాహోర్ లో రద్దీ ప్రాంతమైన మొహల్లా జోహార్ టౌన్లో ఉన్న హఫీజ్ ఇంటి చుట్టూ పాక్ ఆర్మీ, ఐఎస్ఐ, లష్కరే ముఠా 24 గంటలు పహారా కాస్తున్నట్టు సమాచారం.
అతడి ఇంటి కాంపౌండ్ చుట్టూ ఆర్మీ డ్రోన్లతో నిఘా పెట్టినట్లు తెలుస్తున్నది. హఫీజ్ ఇంటికి నలువైపులా దాదాపు 4 కిలోమీటర్ల పరిధిలో సీసీ కెమెరాలను అమర్చడంతోపాటు సెక్యూరిటీని కట్టుదిట్టం చేశారు. ఆ ఇంటిచుట్టుపక్కలకు ఎవరినీ అనుమతించడం లేదు. పహల్గాం ఉగ్రదాడికి లష్కరే అనుబంధ సంస్థ ‘ది రెస్టిస్టెన్స్ఫ్రంట్’ (టీఆర్ఎఫ్) బాధ్యత వహించింది.
దీంతో ఈ టెర్రర్ అటాక్ వెనుక హఫీజ్ ఉన్నట్టు భారత్ అనుమానం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో అతడిని లక్ష్యంగా చేసుకొని దాడులు చేయొచ్చన్న అంచనాలతోనే సెక్యూరిటీని అమాంతం పెంచినట్లు సమాచారం.