శంషాబాద్, వెలుగు : రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం పెద్ద షాపూర్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఒకదానితో ఒకటి నాలుగు వెహికల్స్ ఢీకొనడంతో నలుగురు గాయపడ్డారు. ఎం.సురేశ్ అనే వ్యక్తి తన ఫ్యామిలీతో శనివారం ఏపీలోని అనంతపురం నుంచి హైదరాబాద్కు హ్యుందాయ్ కారులో వస్తున్నారు. పెద్ద షాపూర్ పరిధిలోకి రాగానే ముందు వెళ్తున్న ఓ కంటైనర్ సడన్ బ్రేక్ వేయడంతో వెనకనున్న సురేశ్ కారు ఆ కంటైనర్ను ఢీకొట్టింది. ఆ వెనకాలే వస్తున్న కియా సెల్టోస్ కారు హ్యుందాయ్ను ఢీకొంది.
ఈ ప్రమాదాన్ని గమనించని ఆర్టీసీ బస్సు డ్రైవర్ కియా కారును ఢీకొట్టాడు. ఈ ఘటనలో రెండు కార్లు ధ్వంసం అయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని, ప్రమాదంలో గాయపడిన వారిని స్థానిక హాస్పిటల్కు తరలించారు. కాగా, అదే సమయంలో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ హైదరాబాద్ నుంచి షాద్నగర్ వైపు వెళ్తుండగా, తీవ్ర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దీంతో అక్కడే ఉన్న పోలీసు అధికారులు వెంటనే ట్రాఫిక్ క్లియర్ చేసి, ఆయన కాన్వాయ్ను పంపించారు.