
ముషీరాబాద్,వెలుగు: స్వలాభం కోసం కాకుండా ప్రజల కోసం పని చేయాలనే ఆలోచన ప్రతి ఒక్కరిలో ఉండాలని జాతీయ ఎస్టీ కమిషన్సభ్యుడు జాటోతు హుస్సేన్ నాయక్ అన్నారు. బిహార్, యూపీ రాష్ట్రాలు అభివృద్ధి చెందుతున్నాయని, తెలంగాణ మాత్రం అప్పుల ఊబిలో కూరుకుపోతోందని తెలిపారు. ఉచిత పథకాలు మంచివి కావని, ప్రజలకు మేలు చేసే విద్య, వైద్యం అందించి, ఉద్యోగాలు, మౌలిక సదుపాయాలు కల్పించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
తెలంగాణ స్టేట్ యానాదిస్(గిరిజన) వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం మెట్టుగూడ రైల్వే ఆఫీసర్స్ క్లబ్ లో యానాదుల ఆత్మగౌరవ సభ, జనరల్ బాడీ మీటింగ్, ఫ్యామిలీ గెట్ టు గెదర్ నిర్వహించారు. ముఖ్య అతిథులుగా ఆయనతోపాటు ఐఏఎస్ అధికారి ఈ.శ్రీధర్, అసోసియేషన్ చైర్మన్ ఈ.ఆంజనేయులు, జాతీయ గిరిజన ఉద్యోగుల సంఘం జాతీయ అధ్యక్షుడు పీవీ.రమణ హాజరయ్యారు.
హుస్సేన్ నాయక్ మాట్లాడుతూ.. ఇంగ్లీష్నేర్చుకుంటే ప్రపంచంలో ఎక్కడైనా బతకవచ్చని చెప్పారు. డబ్బుల కంటే గౌరవం పెరగాలని అప్పుడే మమకారం, మానవ సంబంధాలు బలపడతాయని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల కోసం అనేక చట్టాలు, హక్కులు వచ్చినా ఇంకా అవి అందని ద్రాక్షగానే మిగిలాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్టీ కమిషన్ మీ అందరి కోసం పని చేస్తుందనే విషయాన్ని గ్రహించి, సమస్యలను పరిష్కరించుకోవాలని సూచించారు.
అనంతరం తెలంగాణ స్టేట్ యానాదిస్(గిరిజన) వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కమిటీని ఎన్నుకున్నారు. చైర్మన్గా ఈ.ఆంజనేయులు, అధ్యక్షుడిగా సీహెచ్.రామచంద్రరావు, జనరల్ సెక్రటరీ ఐ.సాంబశివరావు, ట్రెజరర్ జేసీ.శేషాద్రి ఎన్నికయ్యారు. కార్యక్రమంలో శ్రీనివాసులు, ఏడుకొండలు, పార్థసారథి, వెంకటేశ్వర్లు, శివశంకర్ రావు, ప్రభాకర్ రావు, రామకృష్ణయ్య, సురేశ్కుమార్ పాల్గొన్నారు.