
పారిస్: ఇండియా స్టార్ షట్లర్ లక్ష్యసేన్.. ఫ్రెంచ్ ఓపెన్ సూపర్–750 టోర్నీలో తొలి రౌండ్లోనే ఇంటిముఖం పట్టాడు. మంగళవారం జరిగిన మెన్స్ సింగిల్స్ తొలి రౌండ్లో అన్సీడెడ్ లక్ష్యసేన్ 7–21, 16–21తో వరల్డ్ 29వ ర్యాంకర్ ఎన్హట్ ఎన్గుయెన్ (ఐర్లాండ్) చేతిలో ఓడాడు. 43 నిమిషాల మ్యాచ్లో లక్ష్యకు సరైన ఆరంభం దక్కలేదు.
ఎక్కువగా వైడ్ షాట్స్ ఆడిన ఇండియన్ ప్లేయర్ నెట్ వద్ద ఎర్రర్స్ చేశాడు. ఇదే టైమ్లో ఎన్గుయెన్ బలమైన స్మాష్లు, ర్యాలీలతో విరుచుకుపడ్డాడు. ఈ క్రమంలో 2–7తో తొలి గేమ్ మొదలుపెట్టిన లక్ష్యసేన్ ఏ దశలోనూ స్కోరును సమం చేయలేకపోయాడు. 19–7 లీడ్తో ఐర్లాండ్ ప్లేయర్ గేమ్ను సాధించాడు.
రెండో గేమ్లోనూ 4–6, 5–11తో వెనుకబడ్డ లక్ష్యసేన్ మధ్యలో లాంగ్ ర్యాలీస్తో 11–15కు లీడ్ను తగ్గించాడు. కానీ ఎన్యుయెన్ ఏమాత్రం చాన్స్ ఇవ్వకుండా వరుసగా పాయింట్లు సాధించి 17–14తో వెనుదిరిగి చూసుకోలేదు. మిక్స్డ్ డబుల్స్ తొలి రౌండ్లో రోహన్ కపూర్–గద్దె రుత్వికా శివాని 21–12, 21–19తో ఒలెక్సి టిటోవ్–యెవ్హెనియా కాంటెమిర్ (ఉక్రెయిన్)పై గెలిచి ముందంజ వేశారు.
తొలి గేమ్ ఈజీగా నెగ్గిన ఇండియన్ జంటకు రెండో గేమ్లో గట్టి ప్రతిఘటన ఎదురైంది. అయితే క్రాస్ కోర్టు విన్నర్స్, నెట్ వద్ద డ్రాప్స్లో నైపుణ్యం చూపెట్టిన శివాని–రోహన్ కీలక టైమ్లో పాయింట్లు గెలిచి గేమ్తో పాటు మ్యాచ్ను సొంతం చేసుకున్నారు.