యునైటైడ్ అరబ్ ఎమిరేట్స్ ప్రభుత్వం ఉద్యోగులకు న్యూ ఇయర్ గిఫ్ట్ అందించింది. సొంతంగా వ్యాపారం ప్రారంభించాలని కోరుకునే ప్రభుత్వ ఉద్యోగులు ఏడాదిపాటు సెలవు తీసుకోవచ్చు. వీరికి ఈ కాలంలో సగం జీతం అందుతుంది. ఈ కాన్సెప్ట్ను తొలిసారిగా యూఏఈ ఉపాధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ జులై నెలలో ప్రవేశపెట్టారు. ప్రభుత్వ ఉద్యోగాలు చేసేవారిని వ్యాపారాల్లో ప్రోత్సహించడమే ఈ కాన్సెప్ట్ ఉద్దేశం. యూఏఈ వాసులు వ్యాపారాలు చేయడం ద్వారా స్థానికంగా కొత్త ఉద్యోగాలను కల్పించే వీలుంటుంది. అలాగే ఆర్థికంగా పరిపుష్టిని పొందగలుగుతారని యూఏఈ అధికారులు భావిస్తున్నారు.
యూఏఈ యువతరం ప్రభుత్వం ప్రవేశపెట్టే వాణిజ్య ప్రయోజన పథకాలను సద్వినియోగం చేసుకోవడం ద్వారా ఆర్థికంగా నిలదొక్కుకోవచ్చునన్నది షేక్ మొహమ్మద్ కోరిక. వ్యాపారం కోసం ఏడాది సెలవు మంజూరును ఆ ఉద్యోగి శాఖాధిపతి నిర్ణయిస్తారు. ఇందుకు కొన్ని షరతులు కూడా విధించారు. సెలవు కోరుకునే వారు ముందుగా వెబ్సైట్లో లాగిన్ అయి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ పథకం కింద కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులే దరఖాస్తు పెట్టుకోవాలి. ఈ స్కీమ్ జనవరి 2 నుంచి ప్రారంభించనుంది.