
వాతావరణ మార్పులను తట్టుకునే పంటల పరిశీలన
ఎల్ బీనగర్, వెలుగు: హయత్ నగర్ లోని క్రిడా(సెంట్రల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ ఫర్ డ్రై ల్యాండ్ అగ్రికల్చర్) రీసెర్చ్ సెంటర్ లో జి– 20 బృందం బుధవారం పర్యటించింది. వాతావరణ మార్పులను తట్టుకునే విధంగా అమలయ్యే వ్యవసాయ పద్ధతులను పరిశీలించింది. నాలుగు రోజులుగా నోవాటెల్ హోటల్ లో వర్క్ షాప్ నిర్వహిస్తుండగా బుధవారం హయత్ నగర్ లోని క్రీడా రీసెర్చ్ సెంటర్ ను డెలిగేట్స్ ఫీల్డ్ విజిట్ చేశారు. వాతావరణ మార్పులకు సంబంధించిన వ్యవసాయ పరిశోధనలు, వివిధ సమస్యలపై తమ అభిప్రాయాలు వెల్లడించారు. మూడు రోజులు జరిగే సదస్సులో వాతావరణాన్ని తట్టుకోగల వ్యవసాయ పద్ధతులు, కేస్ స్టడీస్, అనుభవాలు, ఫైనాన్స్ సంస్థాగత సమస్యలపై చర్చించారు.
జి–20 దేశాల ప్రతినిధులు వాతావరణాన్ని తట్టుకుని పంటలు పండించే పద్ధతులపై తమ అభిప్రాయాలను వెల్లడించారు. ఐసీఏఆర్ ఏడీజీ ఎస్ కే చౌదరి మాట్లాడుతూ.. వాతావరణాన్ని తట్టుకోగల పంట రకాలను నాటుకోవడం, సహజ వనరులను కాపాడుకోవడం, రైతులకు, వాటాదారులకు సామర్ధ్య నిర్మాణాన్ని అందించడం సాధించవచ్చన్నారు. క్రిడాను సందర్శించి క్రాప్ టెక్నాలజీ పార్క్, ఫార్మ్ మెషినరీ ఫీల్డ్ డెమోస్ట్రేషన్, సీడ్ హబ్, ప్రాసెసింగ్ ప్లాంట్ క్లైమెట్ రెసిస్టెంట్ అగ్రికల్చర్, వార్మింగ్ బ్లాక్, ప్రొడక్షన్ బ్లాక్, సోలార్ పవర్ మైక్రో ఇరిగేషన్ సిస్టం బ్లాక్ లను పరిశీలించారు. వాతావరణాన్ని తట్టుకోగల వ్యవసాయంపై జి20 వర్క్ షాప్ లో పూర్తిగా అవగాహన కల్పించడం జరిగిందని వివరించారు.