న్యూఢిల్లీ: ఫెర్టిలిటీ సర్వీస్లు అందించే గాడియమ్ ఐవీఎఫ్ అండ్ ఉమెన్ హెల్త్ లిమిటెడ్ ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీఓ) ద్వారా రూ.150–200 కోట్లు సేకరించాలని ప్లాన్ చేస్తోంది. కంపెనీ పబ్లిక్ ఇష్యూ ఈ నెల 20న ఓపెనై 24న ముగుస్తుంది. ఐవీఎఫ్ రంగంలో ఐపీఓకి వస్తున్న మొదటి కంపెనీగా నిలవనుంది.
గాడియమ్ ఐవీఎఫ్ ఆఫర్లో 1.14 కోట్ల కొత్త ఈక్విటీ షేర్లు, అలాగే ప్రమోటర్ మనికా ఖన్నా ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) ద్వారా విక్రయించే 95 లక్షల షేర్లు ఉన్నాయి. ఐపీఓ ద్వారా వచ్చిన నిధుల్లో రూ.50 కోట్లను 19 కొత్త ఐవీఎఫ్ సెంటర్ల ఏర్పాటుకు, రూ.20 కోట్లను అప్పులు చెల్లించడానికి, మిగతా మొత్తం సాధారణ కార్పొరేట్ అవసరాలకు వాడతామని కంపెనీ పేర్కొంది. 2024–25లో గాడియమ్ ఐవీఎఫ్కి రూ.70.72 కోట్ల రెవెన్యూ, రూ.19.13 కోట్ల నెట్ ప్రాఫిట్ వచ్చింది.
విరూపాక్ష ఆర్గానిక్స్ ఐపీఓకు ఓకే
హైదరాబాద్కు చెందిన విరూపాక్ష ఆర్గానిక్స్ లిమిటెడ్ రూ.740 కోట్ల ఐపీఓ కోసం సెబీ అనుమతి పొందింది. ఈ నిధులను కంపెనీ యూనిట్ల విస్తరణకు, అప్పులు తీర్చడానికి వినియోగించనుంది. 2025 ఆర్థిక సంవత్సరంలో ఈ సంస్థ రూ.811 కోట్ల ఆదాయం, రూ.78 కోట్ల లాభం ఆర్జించింది. మరోవైపు ప్రీమియర్ ఇండస్ట్రియల్ కార్ప్, డూరోఫ్లెక్స్, హెక్సాగాన్ నూట్రిషన్, ఓం పవర్ ట్రాన్స్మిషన్ కంపెనీల ఐపీఓలకు కూడా సెబీ అనుమతులు ఇచ్చింది.
