గద్వాల, వెలుగు: ప్రేమ పేరుతో ఓ యువతిని మోసం చేసిన కేసులో గద్వాల పోలీసులు ఓ ఆర్ఎస్ఐని అరెస్ట్ చేశారు. సీఐ చంద్రశేఖర్ కథనం ప్రకారం.. గద్వాల మండలం పరిధిలోని ఓ గ్రామానికి చెందిన యువతి, గద్వాల టౌన్ కు చెందిన మనోహర్ స్కూల్ లెవెల్ నుంచీ స్నేహితులు. ఇద్దరు ఉద్యోగం కోసం హైదరాబాద్లో కోచింగ్ కూడా తీసుకున్నారు. అప్పుడే ఇద్దరూ ప్రేమించుకున్నారు. 2020లో మనోహర్ కు రిజర్వ్ ఎస్సైగా ఉద్యోగం వచ్చింది. ట్రైనింగ్ తర్వాత మనోహర్ఎర్రవల్లి టెన్త్ బెటాలియన్ లో జాబ్లో జాయిన్ అయ్యాడు. అయితే కొద్దిరోజులకే మనోహర్ ప్రవర్తనలో మార్పు వచ్చింది.
యువతి పెళ్లి ప్రస్తావన తెచ్చినప్పుడల్లా దాటా వేస్తూ వస్తున్నాడు. చివరికి నిలదీయడంతో ఇంట్లో ఒప్పుకోవడం లేదని పెండ్లి చేసుకోవడం కుదరదని తేల్చిచెప్పాడు. దీంతో ఆమె మనోహర్ ఇంటికి వెళ్లి అతడి తల్లిదండ్రులతో మాట్లాడింది. వారు ఒప్పుకోకపోవడంతో గద్వాల పోలీసులకు ఫిర్యాదు చేసింది. సీఐ చంద్రశేఖర్, ఎస్ఐ ఆనంద్ విచారణ జరిపి బుధవారం ఆర్ఎస్ఐ మనోహర్ ను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.