![గజ్వేల్ ప్రజ్ఞాపూర్ బడ్జెట్ మీటింగ్ క్యాన్సిల్](https://static.v6velugu.com/uploads/2024/02/gajwel-prajnapur-budget-meeting-cancelled_yNXqIvwjsd.jpg)
- సమావేశానికి 14 మంది కౌన్సిలర్లు దూరం
- అవిశ్వాసంపై చర్యలు తీసుకోవాలని అడిషనల్ కలెక్టర్ను కలిసిన కౌన్సిలర్లు
గజ్వేల్, వెలుగు: మాజీ సీఎం కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న నియెజకవర్గ కేంద్రం గజ్వేల్-ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలో బుధవారం కౌన్సిల్ బడ్జెట్ సమావేశం కోరం లేక వాయిదాపడింది. సమావేశానికి జిల్లా అడిషనల్ కలెక్టర్ గరీమ అగర్వాల్ హాజరయ్యారు. పాలకవర్గంలో 20 మందికి కేవలం ఆరుగురు కౌన్సిలర్లు మాత్రమే హాజరు అయ్యారు. కౌన్సిల్లో అవినీతి జరిగిందని, నిధుల దుర్వినియోగంపై పట్టు పట్టిన 14 మంది కౌన్సిలర్లు సమావేశానికి దూరంగా ఉన్నారు.
వీరంతా కౌన్సిల్జరిగిన అవినీతిపై విచారణ జరిపి తగు చర్యలు తీసుకోవాలని గత కొంతకాలంగా డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే అసంతృప్త కౌన్సిలర్లు అవిశ్వాసానికి మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది. ఇదిలా ఉండగా సమావేశానికి రాకుండా పలువురు కౌన్సిలర్లు సిద్దిపేట కలెక్టర్ ఆఫీస్కు వెళ్లి అడిషనల్ కలెక్టర్ గరిమా అగర్వాల్కు వినతిపత్రాన్ని అందజేశారు.
అందులో గతంలో మున్సిపల్ చైర్మన్ పై ఇచ్చిన అవిశ్వాస తీర్మానం నోటీసు విషయంలో చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే మున్సిపల్ కౌన్సిల్లో జరుగుతున్న అక్రమాలపై విచారణ జరిపించాలని కోరారు. అంతేకాకుండా గత నెల సమావేశంలో మున్సిపల్ పరిధిలో పని చేయకుండానే డ్రా చేసిన డబ్బుల విషయంలో ఇచ్చిన ఫిర్యాదుపై ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని తెలిపారు.